ముంబై: గోవా హోటల్లో ఉన్న శివసేన రెబల్ ఎమ్మెల్యేలు శనివారం ముంబైకి తిరిగి వస్తారని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తెలిపారు. బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ చెప్పడంతో జూలై 3,4 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని చెప్పారు. అసెంబ్లీలో తమకు 170 మందికిపైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఇది ఇంకా పెరుగవచ్చని అన్నారు. బలపరీక్షలో గెలిచే మెజార్టీ తమ ప్రభుత్వానికి ఉందని ధీమా వ్యక్తం చేశారు.
కాగా, 288 మంది శాసన సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి అత్యధికంగా 106 మంది ఎమ్మెల్యేలున్నారు. శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలుండగా అందులో ఏక్నాథ్ షిండేతో సహా 39 మంది తిరుగుబాటు చేశారు. 11 మంది స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో కలిపి 50 మంది ఎమ్మెల్యేలు తన వెంట ఉన్నట్లు షిండే ప్రకటించారు. ఈ లెక్కన 150-165 మధ్య ఎన్డీయే బలం ఉండనుంది.
మరోవైపు పడిపోయిన మహాకూటమి అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వంలో శివసేనతో కలిసి భాగంగా ఉన్న ఎన్సీపీకి 53 మంది, కాంగ్రెస్కు 44 మంది శివసేనకు 17 మంది, ఇద్దరు ఎస్పీ ఎమ్మెల్యేలు, ఒక పీడబ్ల్యూపీఐ, ఒక ఇండిపెండెంట్తో కలిపి 118 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇద్దరు ఏఐఎంఐఎం, ఒక సీపీఎం, ఒక ఎస్డబ్ల్యూపీ ఎమ్మెల్యే కలిపి నలుగురు ఇతర ఎమ్మెల్యేలు ఎటువైపు మొగ్గుతారన్నది స్పష్టం కాలేదు.
అయితే 39 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలు, 11 మంది స్వతంత్ర ఎమ్మెల్యేల్లో ఎంత మంది షిండే-బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారో అన్నది ఈ నెల 4న జరిగే బలపరీక్షలో తేలనుంది. షిండే బలపరీక్షలో నెగ్గాలంటే మ్యాజిక్ ఫిగర్ 144 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాగా, మహారాష్ట్ర శాసనసభ స్పీకర్ పదవికి బీజేపీ నేత రాహుల్ నార్వేకర్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.