కోల్ కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ( West Bengal Assembly Elections ) ఘన విజయం సాధించి వరుసగా మూడోసారి అధికారం కైవసం చేసుకునే దిశగా మమతా బెనర్జీ ( Mamata Banerjee ) సత్తా చాటారు. కాషాయ పార్టీతో హోరాహోరీ పోరు ఎదురైనా తనదైన వ్యూహాలతో దీదీ దూసుకెళ్లారు. అభ్యర్ధుల ఎంపిక నుంచి వివిధ వర్గాల ఓటర్లను ఆకట్టుకోవడంలో ఆమె ఆచితూచి వ్యవహరించారు. కాలికి గాయమైనా దాన్ని సైతం సెంటిమెంట్ అస్త్రంగా మలిచి ఓట్లను రాబట్టుకున్నారు. బెంగాల్లో ఎలాగైనా పాగా వేయాలన్న కమలనాధుల కలలను భగ్నం చేయడంలో దీదీ విజయం సాధించారు.
బెంగాల్లో పెద్ద సంఖ్యలో ఉన్న మహిళా ఓటర్లు మొత్తం ఓటర్లలో 49 శాతం వరకూ ఉన్నారు. సైలెంట్ ఓటర్లుగా పేరున్న మహిళా ఓటర్లను ఆకట్టుకోవడంలో టీఎంసీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పార్టీ అభ్యర్ధుల్లో 17 శాతం అంటే 50 మంది మహిళా అభ్యర్ధులను టీఎంసీ తమ పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిపింది. మహిళా ఓటర్లలో ఉన్న సానుకూలతను మరింత పరిపుష్టం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ౩౩ శాతం రిజర్వేషన్ కల్పిస్తామని, మహిళలకు ఉచిత రవాణా అందుబాటులోకి తెస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు గుప్పించినా మహిళా ఓటర్లు దీదీకి బాసటగా నిలిచారు.
2019 పార్లమెంట్ ఎన్నికల అనంతరం బెంగాల్లో మధ్యతరగతి ఓటర్లు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ పట్ల విశ్వాసం కనబరుస్తూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెట్రో ధరల షాక్, ఎల్పీజీ సిలిండర్ రేట్ల పెరుగుదలతో ఈ వర్గాలు బీజేపీకి దూరమయ్యాయి. మధ్యతరగతిని అక్కున చేర్చుకోవడంలో దీదీ సఫలమయ్యారు. పశ్చిమ బెంగాల్ ఎన్నిక( West Bengal Assembly Elections )ల్లో విజయం సాధించారు.
నిరుద్యోగ యువతను ఆకట్టుకునేందుకు ఈసారి బీజేపీ భారీ వ్యూహరచనే చేసింది. ఉద్యోగాలు లేకపోవడంతో బెంగాల్ నుంచి యువత వలస బాట పట్టిందని బీజేపీ నేతలు, ప్రధాని నరేంద్ర మోదీ పదేపదే ఈ అంశాన్ని ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు. నిరుద్యోగ యువతను కాషాయ పార్టీకి ఓటుబ్యాంక్గా మలిచేందుకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామనే ధోరణిలో ప్రచార పర్వం హోరెత్తించారు. బీజేపీ వ్యూహానికి ప్రతిగా తాము ఏటా యువతకు ఐదు లక్షల ఉద్యోగాలిస్తామని టీఎంసీ మేనిఫెస్టోలో హామీలు గుప్పించింది.
పార్టీల గెలుపోటములను ప్రభావితం చేసేలా బెంగాల్లో 30 శాతం వరకూ ఉండే ముస్లిం ఓట్లను పదిలపరుచుకునేందుకు దీదీ భారీ కసరత్తే చేశారు. ముస్లింలు అధికంగా ఉన్న నందిగ్రామ్ నుంచే పోటీ చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు. 42 మంది ముస్లిం అభ్యర్ధులకు పార్టీ టికెట్లు ఇచ్చారు. అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ, మత గురువు అబ్బాస్ సిద్ధిఖిలు ఎన్నికల బరిలో ఉండటంతో టీఎంసీకి పడే ముస్లిం ఓట్లు చీలతాయని కమలనాధులు ఆశించినా ఆ పరిస్ధితి కనిపించలేదు.
2014 లోక్సభ ఎన్నికల్లో 29 శాతం పైగా ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ ఓటు బ్యాంక్ 2019 సాధారణ ఎన్నికల నాటికి 7.46 శాతానికి దిగజారింది. ఇక మమతా బెనర్జీకి బీజేపీ దీటైన పోటీ ఇస్తున్న క్రమంలో లెఫ్ట్ ఫ్రంట్ సానుభూతిపరులు, పార్టీ మద్దతుదారులు కాషాయపార్టీని నిలువరించేందుకు దీదీవైపు మొగ్గుచూపినట్టు ఫలితాలు వెల్లడిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Stalin : నాన్న లేడు.. అన్న అండ లేదు.. అయినా గెలిపించాడు
Prashant Kishor : బెంగాల్లో పంతం నెగ్గించుకున్న ప్రశాంత్ కిశోర్
సాగర్ రిజల్ట్.. తండ్రి మెజార్టీని అధిగమించిన తనయుడు..
రౌండ్ల వారీగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాలు
స్టాలిన్ గెలుపు : మేయర్ టూ ముఖ్యమంత్రి