ముంబై, మార్చి 8: ఇన్నాళ్లూ స్మార్ట్ఫోన్ వినియోగదారులకే లభించిన డిజిటల్ లావాదేవీల సేవలు.. సాధారణ మొబైల్ వినియోగదారులకూ అందుబాటులోకి వచ్చాయి. ఫీచర్ ఫోన్ యూజర్లూ తమ మొబైల్ నుంచి డిజిటల్ లావాదేవీలను జరుపవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ‘123పే’ సర్వీస్ను ప్రారంభించారు. ఆర్బీఐ ఆధ్వర్యంలోని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ).. ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ఈ సరికొత్త యూఎస్ఎస్డీ ఆధారిత సర్వీస్ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో దేశంలోని 40 కోట్ల మంది ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ప్రయోజనం చేకూరనున్నది.
ఫీచర్ ఫోన్లు.. స్మార్ట్ఫోన్లు కావు. కాల్స్, మేసేజ్ల వంటి కనీస సౌకర్యాలే తప్ప.. ఇంకా ఎటువంటి సదుపాయాలు వినియోగదారులకు ఉండవు. అందుకే వీరికీ డిజిటల్ పేమెంట్ల వెసులుబాటును కల్పించాలనే ‘123పే’ సర్వీస్ను తెచ్చినట్టు దాస్ చెప్తున్నారు.
మీ ఫీచర్ ఫోన్లో ఓ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందని, ఇది స్మార్ట్ఫోన్లతోపాటు ఫీచర్ ఫోన్లలోనూ అందుబాటులో ఉంటుందని ఆర్బీఐ చెప్తున్నది. ఇక దుకాణాల్లో కనిపించే మొబైల్ నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా ఫీచర్ ఫోన్ యూజర్లు డిజిటల్ లావాదేవీలను పూర్తిచేయవచ్చు. మిస్డ్ కాల్ అనంతరం యూపీఐ పిన్ను నమోదు చేయడం ద్వారా లావాదేవీని గుర్తించడానికి కస్టమర్కు ఇన్కమింగ్ కాల్ వస్తుంది.
డిజిటల్ పేమెంట్స్ సందేహాల నివృత్తికి ఓ నిరంతర (24×7) హెల్ప్లైన్నూ గవర్నర్ దాస్ ప్రారంభించారు. డిజిటల్సాథీ పేరుతో తెచ్చిన ఈ సర్వీస్ను వెబ్సైట్, చాట్బోట్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. డిజిటల్ చెల్లింపులపై ప్రశ్నలను వినియోగదారులు www. digisaathi.info ను సందర్శించి లేదా 14431, 18008913333 నంబర్లకు కాల్ చేసైనా నివృత్తి చేసుకోవచ్చు.
‘123పే’ సర్వీస్ గజిబిజిగా ఉన్నదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టీ రవిశంకర్ అన్నారు. అన్ని టెలికంలు ఈ సర్వీస్ను అనుమతించక పోవచ్చని, ఫ్రీ కూడా కాదన్నారు. దీంతో ఈ సర్వీస్ కావాలంటే ప్రత్యేక రీచార్జ్లు వసూలు చేయవచ్చని కొందరు అంటున్నారు.