ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. శుక్రవారం జరిగిన మానిటరీ పాలసీ కమిటీ (Monetary Policy Committee) సమావేశంలో రేపో రేటుని యథాతథంగా ఉంచుతున్నట్లు RBI గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. అయితే ఆర్బీఐ పాలసీ రేట్లలో ఎలాంటి మార్పు చేయకుండా స్థిరంగా ఉంచడం ఇది వరుసగా ఐదోసారి కావడం గమనార్హం.
పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ చెబుతున్నారు. అందుకే కీలక వడ్డీ రేట్లను 6.5 శాతం దగ్గరే ఉంచాలన్న ప్రతిపాదనకు మానిటరీ పాలసీ కమిటీ ఏక గ్రీవంగా అంగీకారం తెలిపిందని చెప్పారు. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటును 6.25 శాతం వద్ద, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంకు రేటును 6.75 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి చేరుకోవడానికి సమయం పట్టనుంది. ఓ వైపు అప్పులు పెరగడం, మరోవైపు భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కాస్త బలహీనంగా ఉన్నట్లు తెలుస్తున్నది.