న్యూఢిల్లీ, జూన్ 18: సుమారు రూ. 88 వేల కోట్ల విలువైన రూ.500 కరెన్సీ నోట్లు భారత దేశ ఆర్థిక వ్యవస్థలోకి చేరకుండా మాయమైనట్టు వస్తున్న ఆరోపణలపై ఎట్టకేలకు ఆర్బీఐ మౌనం వీడింది. అవన్నీ తప్పుడు ఆరోపణలని, ముద్రణాలయంలో ప్రింటయిన ప్రతి నోటు, ఆర్బీఐకి చేరిన ప్రతి నోటుకు లెక్క ఉంటుందని స్పష్టం చేసింది. మనోరంజన్ రాయ్ అనే వ్యక్తి ఆర్టీఐ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. ముద్రణాలయంలో ప్రింటయిన వేల కోట్ల రూపాయల విలువైన 500 కరెన్సీ నోట్ల రూపాయలు భారత ఆర్థిక వ్యవస్థలోకి రాకుండానే మాయమయ్యాయి. వీటి విలువ 88,305 కోట్ల రూపాయలని తెలిపారు. ఇంత జరిగినా ఆర్బీఐ మౌనంగా ఉండటాన్ని రాయ్ తప్పుబట్టారు.
ఆ ఆరోపణలపై ఆర్బీఐ వివరణ ఇచ్చింది. ఇవన్నీ వదంతులుగా కొట్టి పారేసిన ఆర్బీఐ ‘ఆర్బీఐ నుంచి సేకరించిన సమాచారం తప్పుగా అర్థం చేసుకుని ఈ ఆరోపణలు చేశారు. నోట్ల ముద్రణ, పంపిణీకి సంబంధించిన అంశాలు పరిశీలించడానికి ఒక వ్యవస్థ పనిచేస్తుంది వాటి సమన్వయ పట్టికలు చూస్తే ఆ విషయం తెలుస్తుంది’ అని పేర్కొంది. ప్రతి లావాదేవీని సమన్వయం చేయడానికి ఒక పటిష్టమైన వ్యవస్థ ఉందని. నోట్ల ముద్రణ, నిల్వ, పంపిణీ విభాగాలను ఎప్పటికప్పుడు ఇవి పర్యవేక్షిస్తుంటాయని, ఎలాంటి తప్పుకు ఆస్కారం ఉండదని ఆర్బీఐ తన ప్రకటనలో వివరించింది.