న్యూఢిల్లీ: రూ.2,000 నోట్లలో 97.26 శాతం బ్యాంకుల్లో జమైనట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. 2.7 శాతం బ్యాంకు నోట్లు ఇంకా సర్క్యులేషన్లో ఉన్నట్లు పేర్కొంది. కాగా, రూ.2000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి లేదా మార్పిడి చేయడానికి ఆర్బీఐ ఇచ్చిన గడువు అక్టోబర్ 7వ తేదీతో ముగిసింది. ఆ తర్వాత రూ.2000 నోట్ల చలామణి నిలిచిపోయింది. అయితే, ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాల్లో నోట్ల మార్పిడికి అవకాశం ఉన్నది.
ఈ ఏడాది మే 19వ తేదీ వరకు రూ.3.56 లక్షల కోట్ల విలువైన రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయని, నవంబర్ 30 నాటికి ఇంకా రూ.9,760 కోట్ల విలువ చేసే నోట్లు చలామణిలో ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది. దేశంలోని 19 ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాల్లో రూ.2000 నోట్లను డిపాజిట్ చేసి, ఎక్స్ఛేంజ్ చేసుకునే సదుపాయం కొనసాగుతున్నది. అహ్మదాబాద్, బెంగళూరు, బెలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, హైదరాబాద్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగపూర్, న్యూఢిల్లీ, పట్నా, తిరువనంతపురం నగరాల్లో ఈ 19 ఆర్బీఐ ఇష్యూ కార్యాలయాలు ఉన్నాయి.