ముంబై, జూన్ 12: ‘ఈడీని నియంత్రించే అధికారాన్ని రెండు రోజుల పాటు మాకు అప్పగిస్తే బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ కూడా భయపడి శివసేనకే ఓటేస్తారు’ అని పార్టీ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో తమ అభ్యర్థి సంజయ్ పవార్ బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోవడంపై ఆయన ఇలా స్పందించారు. సంజయ్ రౌత్ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను చూపెట్టి స్వతంత్రులను, చిన్న పార్టీల ఎమ్మెల్యేలను బీజేపీ భయపెట్టిందని ఆరోపించారు.
మహారాష్ట్రలో బీజేపీ మూడు రాజ్యసభ సీట్లు గెలవడం ‘ఎమ్మెల్యేలు అమ్ముడుపోయిన ఫలితమే’ అని ఆరోపించారు. తమకు మద్దతిచ్చిన పలువురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటేశారని రౌత్ పేర్కొన్నారు. బహుజన్ వికాస్ అఘాడీ(బీవీఏ)కి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యే సంజయ్మామా షిండే, స్వాభిమాని పక్ష ఎమ్మెల్యే దేవేంద్ర భూయార్, పీడబ్ల్యూపీ ఎమ్మెల్యే శ్యామ్ సుందర్ షిండే శివసేనకు మద్దతు ప్రకటించి ఓటు మాత్రం బీజేపీకి వేశారని ఆరోపించారు.