మథుర, నవంబర్ 24: గోదాముల్లో నిల్వ ఉంచిన 500 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయని యూపీ పోలీసులు కోర్టుకు చెప్పుకొచ్చారు. పోలీసుల కథ నమ్మని కోర్టు సాక్ష్యాధారాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. యూపీలోని మథుర జిల్లాలో రెండు వేర్వేరు కేసుల్లో షేర్గఢ్, హైవే పోలీసులు 386 కిలో లు, 195 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు. ఈ కేసు గురువారం ప్రత్యేక నార్కోటిక్, డ్రగ్ కోర్టులో విచారణకు వచ్చింది.
స్వాధీనం చేసుకొన్న 586 కిలోల గంజాయిని కోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకొని గోదాముల్లో నిల్వచేసిన 500 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయని పోలీసులు కోర్టుకు తెలిపారు. నిల్వ చేసిన సరుకులను ఎలుకల బెడద నుంచి రక్షించే పరిస్థితి పోలీస్స్టేషన్లలో లేదని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంలో సాక్ష్యాధారాలతో కూడిన నివేదికను ఈ నెల 26లోగా సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.