న్యూఢిల్లీ: సైరస్ మిస్త్రీ కేసులో టాటా సన్స్కు అనుకూలంగా ఇవాళ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. ఆ తీర్పును రతన్ టాటా మెచ్చుకున్నారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఉద్దేశిస్తూ ఇవాళ ఆయన తన ట్విట్టర్లో స్పందించారు. తీర్పు పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇది గెలుపు, ఓటముల అంశం కాదు అని, తన సమగ్రతపై నిరంతరం దాడి జరిగిందని, టాటా గ్రూపు నైతికతపై కూడా దాడి జరిగిందని రతన్ తన ట్వీట్లో తెలిపారు. సుప్రీం ఇచ్చి తీర్పు.. సంస్థలో ఉన్న నైతిక విలువులకు, ప్రమాణాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని రతన్ పేర్కొన్నారు. సుప్రీం తీర్పు నిష్పక్షతను, న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని కలిగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదీ తీర్పు..
టాటా సన్స్ చైర్మన్గా మళ్లీ సైరస్ మిస్త్రీని నియమించాలన్న నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తీర్పును ఇవాళ సుప్రీంకోర్టు కొట్టేసింది. గతేడాది జనవరి 10న ఎన్సీఎల్ఏటీ ఇచ్చిన ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన టాటా సన్స్కు అనుకూలంగా శుక్రవారం తీర్పు వెలువడింది. 2016, అక్టోబర్లో సైరస్ మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి తొలగించారు బోర్డు సభ్యులు. ఇది కార్పొరేట్ పాలన సూత్రాల ఉల్లంఘనే అవుతుందని షాపూర్జీ పల్లోంజీ (ఎస్పీ) వాదించింది. అయితే ఇందులో ఉల్లంఘనలు ఏవీ లేవని, మిస్త్రీని తొలగించే హక్కు బోర్డుకు ఉన్నదని టాటా గ్రూప్ వాదించింది. టాటాల వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది.
ఇక షేర్ల విషయాన్ని మరో న్యాయ ప్రక్రియలో తేల్చుకోవాలని కూడా టాటా గ్రూప్, సైరస్ మిస్త్రీలకు సుప్రీంకోర్టు సూచించింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం టాటా గ్రూప్కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. 2012లో రతన్ టాటా తర్వాత టాటా సన్స్ చైర్మన్ అయిన సైరస్ మిస్త్రీని 2016లో బోర్డు తొలగించింది. టాటా సన్స్లో మిస్త్రీ కుటుంబానికి 18.37 శాతం వాటా ఉంది.