Droupadi Murmu | కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో బసచేసిన ముర్ము.. ఉదయం వరాహస్వామి ఆలయానికి వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం నడుచుకుంటూ శ్రీవారి ఆలయం ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. రాష్ట్రపతికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి.. శ్రీవారి దర్శనం కల్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలతో రాష్ట్రపతిని సత్కరించారు.