యూపీలో పోలీస్ స్టేషన్ ఎదుటే
లైంగికదాడి బాధితురాలి ఆత్మహత్యాయత్నం
బాఘ్పట్, మే 26: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మహిళలకు రక్షణ కరువైంది. లైంగికదాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఓ బాధితురాలు పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్యకు యత్నించింది. బాఘ్పట్ జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది. బాఘ్పట్కు చెందిన మహిళకు షామ్లీ జిల్లా కైరానా ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితో నాలుగేండ్ల కింద పెండ్లయింది. అయితే రూ.4 లక్షల కట్నం, కారు ఇవ్వాలని తన భర్త, కుటుంబసభ్యులు తనను వేధిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నది.
భర్త సోదరుడు తనపై లైంగిక దాడికి పాల్ప డి, వీడియో తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నారని, ఈ విషయం బయటచెబితే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని చెబుతు న్నది. గతంలో గర్భంతో ఉన్న సమయంలో తన భర్త కాలుతో తన్నడంతో గర్భస్రావమైందని కేసు పెట్టింది. మే 7న తన తల్లిగారింట్లో ఉండగా, నలుగురు ఇంట్లోకి చొరబడి తనపై లైంగిక దాడి చేశారని ఆరోపించింది. దీనిపై మరో కేసు కూడా నమోదైంది. ఈ రెండు కేసుల్లో తనకు న్యాయం చేయాలని కోరుతూ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నది. తన తల్లిని, సోదరుడిని పోలీసులు అరెస్టు చేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.