సూరత్: నాలుగేండ్ల బాలికపై హత్యాచారానికి (Rape Accused) పాల్పడిన వ్యక్తికి 30 రోజుల్లోనే న్యాయస్థానం శిక్ష విధించింది. నిందితుడిన దోషిగా తేల్చిన గుజరాత్లోని సూరత్ పోక్సో ప్రత్యేక కోర్టు అతనికి జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.
ఉత్తరప్రదేశ్కు చెందిన అజయ్ నిషద్ అనే వ్యక్తి.. గత నెల 12న సూరత్లోని సచిన్ డీఐడీసీ ప్రాంతంలో తన ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేండ్ల చిన్నారి కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను హత్యచేసి నిర్జన ప్రాంతంలో పడేశాడు. కేసు నమోదుచేసిన పోలీసులు అజయ్ నిషద్ను అక్టోబర్ 13న అరెస్టు చేశారు.
నిందితుడిపై పోలీసులు పది రోజుల్లోనే చార్జిషీటు దాఖలు చేశారు. దీంతో ప్రత్యేక కోర్టు అక్టోబర్ 25 నుంచి ఐదు రోజుల్లోనే విచారణను ముగించింది. దోషికి జీవిత ఖైతు విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి పీఎస్ కాలా గురువారం తీర్పునిచ్చారు. అదేవిధంగా రూ.లక్ష జరిమానా విధించారు. గుజరాత్లోని ట్రయల్ కోర్టు ఇంత తక్కువ వ్యవధిలో తీర్పు ఇవ్వడం ఇదే మొదటిసారి కావడం విశేషం.