Ramesh Bidhuri | న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కల్కాజీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రమేశ్ బిధూరి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జరిగిన ఒక సభలో ఆయన మాట్లాడుతూ తాను గెలిస్తే నియోజకవర్గంలోని రోడ్లను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ చెంపలంతా నునుపుగా మారుస్తానని అన్నారు. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ సహచర ఎంపీని దూషించి ఎలాంటి శిక్ష అనుభవించని వ్యక్తి నుంచి ఇంతకు మించిన ప్రవర్తన ఏం ఆశిస్తామని ప్రశ్నించింది. విమర్శలు పెరగడంతో బిధూరీ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.
మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీపైనా బిధూరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆతిశీ తన తండ్రి పేరునే మార్చేశారని ఆరోపించారు. ఒకప్పుడు మర్లేనాగా ఉన్న ఆతిశీ ఇప్పుడు సింగ్ అయ్యారని, ఆమె తన తండ్రినే మార్చేశారని అన్నారు. బిధూరీవ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బీజేపీ నాయకులు సిగ్గు లేకుండా అన్ని హద్దులు దాటేశారని ఆయన విమర్శించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీని బీజేపీ నాయకులు దుర్భాషలాడుతున్నారని, ఒక మహిళా ముఖ్యమంత్రిని అవమానించడాన్ని ఢిల్లీ ప్రజలు సహించరని హెచ్చరించారు.