కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మూడు ప్రధాన పార్టీలపై మండిపడ్డారు. బీజేపీ, లెఫ్ట్, కాంగ్రెస్ పార్టీలను రామ్, వామ్, శ్యామ్గా పేర్కొన్నారు. బెంగాల్లో చేతులు కలిపిన ఈ మూడు పార్టీలు తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. 24 ఉత్తర పరగణాస్ జిల్లాలోని సందేశ్ఖాలీ ప్రాంతంలో శాంతికి విఘాతం కలిగించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. స్థానిక టీఎంసీ నాయకులపై తమ ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని తెలిపారు. అయితే బీజేపీ కార్యకర్తలపై ఆ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. బీజేపీ బెంగాల్ వ్యతిరేకి, మహిళా వ్యతిరేకి, రైతు వ్యతిరేకి, దళిత వ్యతిరేకి అని మండిపడ్డారు.
కాగా, బెంగాల్లో ఏదైనా జరిగితే ఈడీ, సీబీఐ ద్వారా బీజేపీ తమను బెదిరిస్తున్నదని మమతా బెనర్జీ ఆరోపించారు. బీజేపీ ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం (ఈసీ) పనిచేస్తే దానిపై పోరాడే హక్కు తమకు ఉందన్నారు. గతంలో వామపక్షాల హింసను ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఇప్పుడు బీజేపీ చిత్రహింసలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. బెంగాల్లో తనకు వ్యతిరేకంగా బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్ ( రామ్, వామ్, శ్యామ్) చాలా కాలం కిందటే చేతులు కలిపాయని ఆమె ఆరోపించారు.