న్యూఢిల్లీ: అయోధ్యలో రామ జన్మభూమి వద్ద నూతనంగా రామ మందిరాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే 2024, జనవరి ఒకటో తేదీన ఆ రామ మందిరాన్ని ఆవిష్కరించనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. బాబ్రీ మసీదును కూల్చివేసిన స్థలం వద్ద కొత్త ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రామ్ లల్లా దర్శనం నూతనంగా నిర్మిస్తున్న ఆలయం పరిసర ప్రాంతంలో జరుగుతోంది. 70 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణం జరుగుతున్నది.
ఆలయానికి చెందిన 45 శాతం నిర్మాణ పనులు పూర్తి అయినట్లు తెలుస్తోంది. రామ్ లల్లా గర్భగృహ దర్శనం జనవరి 2024 నుంచి ఉంటుందని ఇటీవల రామజన్మభూమి ట్రస్టు కూడా వెల్లడించింది. టెంపుల్ సైట్ వద్ద 550 మంది ఎల్ అండ్ టీ కార్మికులు పనిచేస్తున్నారు. ఆలయ నిర్మాణం కోసం వాడే పింక్ సాండ్స్టోన్ కోసం రాజస్థాన్లో మరో వెయ్యి మంది కార్మికులు పనిచేస్తున్నారు. పూర్తి టెంపుల్ కాంప్లెక్స్ను మాత్రం 2025లోగా పూర్తి చేయనున్నారు. విరాళాల రూపంలో 3200 కోట్లు ఇప్పటికే ట్రస్టుకు అందాయి.