లక్నో, జూన్ 19 : అయోధ్య రామమందిరం విరాళాలను దారి మళ్లించారంటూ వస్తున్న ఆరోపణలపై ఎట్టకేలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ట్రస్ట్ అభ్యర్థన మేరకు సిట్ను నియమించామని, ప్రతిపక్షాలు, ఇతర విమర్శకుల దగ్గర ఏవైనా సాక్ష్యాలు ఉంటే సిట్కు పంపించాలని కోరారు. సిట్ అధికారులు నీళ్లు, నిజాలను నిగ్గుతేలుస్తారని వెల్లడించారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి విజయ్ విశ్వాస్ పంత్తో కూడిన ముగ్గురు అధికారుల బృందం ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిందన్నారు. రామభక్తులు మందిరం నిర్మాణం కోసం 500 ఏండ్లు ఆగారని.. ఇంకో 15 రోజులు ఆగితే నిజాలు తేలిపోతాయని చెప్పారు. ప్రతిపక్షాలు రామమందిరం ప్రాముఖ్యతను తగ్గించడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయని యోగి విమర్శించారు. రామభక్తులకు అవమానం జరిగిందంటూ సమాజ్ వాదీ పార్టీ చెబుతున్నదని.. సుప్రీంకోర్టులో రామజన్మభూమిపై విచారణ జరిగినప్పుడు భక్తులకు అవమానం జరిగినట్టు కాదా అని యోగి ప్రశ్నించారు.