Ayodhya Ram Mandir | అయోధ్య, జనవరి 17: అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించనున్న రామ్లల్లా విగ్రహం బుధవారం ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. ట్రక్కులో విగ్రహం రాగానే జై శ్రీరామ్ నినాదంతో ప్రాంగణం దద్దరిల్లింది. క్రేన్ సహాయంతో విగ్రహాన్ని గుడిలోకి చేర్చారు. గురువారం ఆలయ గర్భగుడిలోకి విగ్రహాన్ని తెస్తారు. కాగా, వెండితో చేసిన ఒక రామ్ లల్లా విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో బుధవారం ఊరేగించారు. పూజారి నెత్తిపై కలశాన్ని ఉంచుకుని ముందు నడుస్తుండగా, పూలతో అలంకరించిన పల్లకిలో ఈ వెండి విగ్రహాన్ని పల్లకిలో ఊరేగించారు.
అంతకుముందు ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాలలో భాగంగా అయోధ్యలో కలశ పూజ ఘనంగా నిర్వహించారు. శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు అనిల్మిశ్రా దంపతులు సరయు నది ఒడ్డున దీనిని భక్తి శ్రద్ధలతో చేపట్టారు. అనంతరం కలశాలలో సరయు నది నీటిని రామమందిరానికి తీసుకుని వెళ్లారు. కాగా, గురువారం అయోధ్య రామ మందిరం గర్భగుడిలోకి బాల రాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. దీంతో తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులతో పాటు నిర్మోహి అఖాడాకు చెందిన మహంత్ దినేంద్ర దాస్, పూజారి సునీల్ దాస్ విగ్రహాన్ని ప్రతిష్ఠించే ప్రదేశం వద్ద పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు.
అయోధ్య రామునికి పద్మనాభుని విల్లు
ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాన్ని పురస్కరించుకుని కేరళలోని శ్రీ పద్మనాభ స్వామి దేవాలయం అయోధ్య రామునికి సంప్రదాయ ఆచార విల్లు ‘ఓనవిల్లు’ను బహూకరించనుంది. ఈ నెల 18న అయోధ్యలో దీనిని ఆలయ నిర్వాహకులు అయోధ్య ట్రస్ట్కు అందజేస్తారు.
జనవరి 22 తర్వాతే: కేజ్రీవాల్
తన కుటుంబంతో సహా వెళ్లి అయోధ్య రాముడిని దర్శించుకుంటానని, అయితే జనవరి 22 తర్వాత ఆ పనిచేస్తానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం తెలిపారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ సైతం ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాతే అయోధ్య రాముడిని దర్శించుకుంటానని తెలిపారు. ఈ నెలలో అయోధ్య ప్రాణ ప్రతిష్ఠకు వెళ్లే ఉద్దేశం లేదని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ స్పష్టం చేశారు.
ప్రాణ ప్రతిష్ఠను రద్దు చేయాలంటూ పిల్
అయోధ్యలో చేపట్టే ప్రాణ ప్రతిష్ఠను వెంటనే నిలిపివేయాలని యూపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ కార్యక్రమం పూర్తిగా రాజకీయ ప్రయోజనానికి ఉద్దేశించినదని, దీనిని వెంటనే రద్దు చేయాలని యూపీ ఘజియాబాద్కు చెందిన భోలాద దాస్ ఈ పిల్ దాఖలు చేశారు.