చండీగఢ్: హామీలను అమలు చేయని కేంద్ర ప్రభుత్వ తీరుపై రైతులు కన్నెర్ర చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం పంజాబ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. మూడు వ్యవసాయ చట్టాల రద్దు సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని అన్నదాతలు మండిపడ్డారు. కనీస మద్దతు ధర, రుణాల మాఫీ తదితర హామీలను కేంద్రం మరిచిందని విమర్శించారు.
లఖీంపూర్ హింసాత్మక ఘటన బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ‘ఎంఎస్పీ చట్టబద్ధతకు డిమాండ్ చేస్తున్నాం. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని కేంద్రం చెప్పింది. అది అమలు కాకపోగా మా రుణాలు రెట్టింపయ్యాయి’ అని రైతు నాయకుడు హరీందర్ లోఖోవాల్ తెలిపారు. తెహ్సిల్, జిల్లా కేంద్రాలు కలిసి సుమారు వంద ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించినట్టు రైతు నాయకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ తెలిపారు. ‘మా డిమాండ్లను నెరవేర్చకపోతే ఫిబ్రవరి 16న భారత్ బంద్ చేపడతాం’ అని ఆయన వెల్లడించారు.