న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్ను, ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేసిన పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్సింగ్ సిద్ధూపై ఆప్ ప్రతివిమర్శలు చేసింది. ఆప్ నేత రాఘవ్ చద్దా సిద్ధూను పంజాబ్ రాజకీయాల్లో రాఖీసావంత్గా అభివర్ణించారు. ఈ మేరకు రాఘవ్ చద్దా ఒక ట్వీట్ చేశారు. గత డిసెంబర్లో కేజ్రివాల్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రైతులను దోపిడీకి గురిచేసేలా ఉందంటూ సిద్ధూ ఈ ఉదయం ట్విట్టర్లో ఓ వీడియో పెట్టారు.
కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు అనుగుణంగా ఆప్ సర్కారు వ్యవహారం ఉన్నదని సిద్ధూ ఆ వీడియోలో ఆరోపించారు. అసలు వ్యవసాయ చట్టాలపై ఆప్ వైఖరి ఏందో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాఘవ్ చద్దా సిద్ధూపై విమర్శనాస్త్రాలు సంధించారు. పంజాబ్ రాజకీయాల్లో రాఖీ సావంత్ అయిన నవజ్యోత్సింగ్ సిద్ధూ చీటికిమాటికి ముఖ్యమంత్రి అమరీందర్సింగ్పై విమర్శలు చూస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నుంచి చీవాట్లు తిన్నాడని, అందుకే మార్పు కోసం ఇప్పుడు కేజ్రివాల్ వెంటపడ్డాడని చద్దా ఎద్దేవా చేశారు. కెప్టెన్ అమరీందర్సింగ్పై రేపు మరింత తీవ్రంగా విమర్శలు చేస్తాడని చద్దా చమత్కరించారు.