న్యూఢిల్లీ : రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వంపై జాతీయ రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ధాన్యం సేకరణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన నిరసన దీక్షలో రాకేశ్ తికాయత్ పాల్గొని ప్రసంగించారు.
దేశంలో ఏం జరుగుతోందని తికాయత్ ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు మరణిస్తూనే ఉండాలా? అని ప్రశ్నించారు. దేశంలో రైతులు తమ హక్కుల కోసం పోరాడుతూనే ఉంటారు. ధాన్యం కొనాలంటూ తెలంగాణ ప్రభుత్వం ధర్నా చేస్తోంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో పోరాడడం కేంద్రానికి సిగ్గుచేటు. ధాన్యం కొనుగోలుకు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలి. ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి రావాల్సి వస్తుంది. సాగుచట్టాల రద్దు కోసం ఢిల్లీలో 13 నెలల పాటు ఉద్యమించాం. కేంద్రం ఏడాదికి 3 విడతలుగా రైతులకు రూ. 6 వేలు ఇస్తోంది. ఏడాదికి రూ. 6 వేలు ఇస్తూ రైతులను ఉద్ధరిస్తున్నట్లు కేంద్రం మాట్లాడుతోంది అని ఎద్దెవా చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు మద్దతుగా ఈ ఆందోళన చేస్తున్నారు. కేసీఆర్ చేస్తున్నది రాజకీయ ఉద్యమం కాదు అని తికాయత్ స్పష్టం చేశారు. రైతుల కోసం మమతా బెనర్జీ కూడా ఆందోళన చేస్తున్నారు. రైతుల పక్షాన కేసీఆర్ చేస్తున్న ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను. రైతుల కోసం పోరాటం ఎవరు చేసినా వారికి మద్ధతు ఉంటుందని స్పష్టం చేశారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న పోరాటం అభినందనీయమని తికాయత్ ప్రశంసలు కురిపించారు.