చెన్నై : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో 30 ఏళ్లకుపైగా జైలు జీవితం అనుభవంచిన ఆరుగురు దోషులు సుప్రీంకోర్టు ఆదేశాలతో జైలు నుంచి విడుదలయ్యారు. ఈ ఆరుగురిలో ఒకరైన నళిని శ్రీహరన్ను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శనివారం జైలు అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడింది. ‘ఇది నాకు కొత్త జీవితం. ప్రజాజీవితంలో కలువబోవడం లేదు. నా భర్త, కుమార్తెతో నాకు ఇది కొత్త జీవితం. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు’ అని జైలు నుంచి విడుదలైన అనంతరం తెలిపింది.
1991లో రాజీవ్గాంధీ హత్యకేసులో దోషులుగా తేలిన నళినీ శ్రీహరన్తో పాటు మరో ఐదుగురిని విడుదల చేస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని తమిళనాడులో పలువురు స్వాగతించారు. ఖైదీల సత్ప్రవర్తన, 30 సంవత్సరాలకుపైగా జైలు శిక్ష అనుభవించడం తదితర అంశాల ఆధారంగా కోర్టు నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు పేర్కొంది. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబుదూరులో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్ గాంధీపై ఆత్మాహుతి దాడి జరిగింది.
ధాను మహిళ తనను తాను పేల్చుకుంది. ఆ దుర్ఘటనలో రాజీవ్ గాంధీతో పాటు మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో ఏడుగురిని దోషులుగా తేల్చుతూ 1998లో ఉగ్రవాద వ్యతిరేక కోర్టు మరణ శిక్ష విధించింది. ఆ తర్వాత ఏడాది పేరరివాళన్ సహా మురుగన్, నళిని, శాంతన్ మరణశిక్షను సుప్రీంకోర్టు నిలిపివేసి.. 2014లో పేరరివాళన్తో పాటు శాంతన్, మురుగన్ మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. 2000లో సోనియా గాంధీ జోక్యంతో నళిని మరణశిక్షను కూడా యావజ్జీవ కారాగార శిక్షకు తగ్గించారు.
ఈ కేసులో ఇప్పటికే పేరరివాలన్ జైలు నుంచి విడుదలయ్యారు. తమిళనాడు ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టినా.. గవర్నర్ రాష్ట్రపతికి సిఫారసు చేయడంతో.. అప్పట్లో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు.. పేరరివాళన్ 30 ఏళ్లు శిక్ష అనుభించాడని.. జైల్లో సత్ప్రవర్తన ఉందని స్పష్టం చేసింది. ఆర్టికల్ 142 కింద అసాధారణ అధికారాలను ఉపయోగించి.. పేరరివాలన్ గతేడాది మేలో విడుదల చేసింది. తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో మిగతా ఆరుగురు నిందితులు సైతం జైలు జీవితం నుంచి విముక్తి పొందారు.