Rajadhani Express | ముంబై- ఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. శుక్రవారం రాత్రి ముంబై నుంచి వెళుతున్న ఎక్స్ప్రెస్ రైలు.. రాత్రి 7 గంటల సమయంలో గుజరాత్లో వల్సాడ్ సమీపాన రైల్వే ట్రాక్ మీద పెట్టిన సిమెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. అయితే, ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదని పోలీసులు శనివారం చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే పట్టాలపై సిమెంట్ స్తంభం పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు.
ముంబై-హజ్రత్ నిజాముద్దీన్ ఆగస్ట్ క్రాంతి రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు.. వల్సాడ్కు దగ్గర్లోని అతుల్ రైల్వే స్టేషన్ సమీపాన ట్రాక్పై ఉన్న సిమెంట్ స్తంభాన్ని ఢీకొట్టగానే ఆ స్తంభం పక్కకు జరిగింది. దీనివల్ల రైలు ప్రయాణంపై ఎటువంటి ప్రభావం చూపలేదు. ప్రయాణికులెవరూ గాయ పడలేదని వల్సాడ్ పోలీసులు తెలిపారు.
లోకో పైలట్ వెంటనే రైల్వే స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇచ్చారని చెప్పారు. ఈ సమాచారం అందగానే రైల్వేశాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసులు, రైల్వేశాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఆగంతకులు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని సూరత్ ఐజీ రాజ్కుమార్ పాండ్యన్ చెప్పారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వల్సాడ్ రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. టెక్నికల్ ఆధారాలతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.