జైపూర్ : రాజస్ధాన్లో (Rajasthan Polls) అశోక్ గెహ్లాట్ సారధ్యంలోని కాంగ్రెస్ సర్కార్ ప్రజలను లూటీ చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలు బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోలిస్తే రాజస్ధాన్లో అధికంగా ఉన్నాయని అన్నారు. జుంఝ్నూలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనపై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ హయాంలో అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు ధోరణి మాత్రమే ఉంటుందని అన్నారు. ఈ విధానంతో కాంగ్రెస్ దేశానికి తీవ్ర నష్టం కలిగించిందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఐదేండ్లలో తమ ఎమ్మెల్యేలు, పార్టీ అభ్యర్ధులు ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని సీఎం గెహ్లాట్ స్వయంగా అంగీకరించారని మోదీ పేర్కొన్నారు.
రాజస్ధాన్లో జాదూగర్, బాజీగర్ గేమ్ కొనసాగుతోందని దుయ్యబట్టారు. ప్రజల సొమ్ము దోచుకోవడంలో కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నారని, రాష్ట్రాన్ని దోచుకున్న కాంగ్రెస్ మళ్లీ గద్దెనెక్కే పరిస్ధితి లేదని అన్నారు. తాము అధికారంలోకి వస్తే కాంగ్రెస్ అవినీతి జట్టును తరిమికొడతామని హామీ ఇచ్చారు.ఇక నవంబర్ 25న రాజస్ధాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More :