జైపూర్: కేబినెట్ నుంచి ఉధ్వాసనకు గురైన మంత్రి రాజేంద్రసింగ్ గుడా (Rajendra Gudha) సీఎం అశోక్ గెహ్లాట్ (CM Ashok Gehlot) ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. మహిళలపై నేరాల్లో (Crimes against women) దేశంలోనే రాజస్థాన్ (Rajasthan) మొదటి స్థానంలో ఉందని ఆరోపించారు. రాజస్థాన్ కూతుర్లు, సోదరీమణులు తనను విధాన సభకు పంపించారన్నారు. మహిళల రక్షణకు పాటుపడటానని తనకు ఓట్లువేసి గెలిపించారని చెప్పారు. రాజస్థాన్ మొగోళ్ల రాష్ట్రమని ఏకంగా క్యాబినెట్ మంత్రి శాంతి కుమార్ ధరివాల్ (Shanti Kumar Dhariwal) ప్రకటించినప్పుడు తప్పులేనిది.. మహిళ భద్రత గురించి తాను మాట్లాడితే తప్పు ఎలా అవుతుందని మాజీ మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలు పెరుగుతున్నాయని రాజేంద్రసింగ్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. దీంతో గంటల వ్యవధిలోనే ఆయనను సీఎం అశోక్ గెహ్లాట్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే.
కాగా, సీఎం అశోక్ గెహ్లాట్ అవినీతి చిట్టాను సోమవారం అసెంబ్లీ (Assembly) వేదికగా బట్టబయలు చేసేందుకు మాజీ మంత్రి ప్రయత్నించారు. ముఖ్యమంత్రి అవినీతి చిట్టా అంటూ రాజేంద్రసింగ్ సభకు ఒక ఎరుపు రంగు డైరీని తీసుకొచ్చారు. సీఎం అశోక్ గెహ్లాట్ అక్రమ ఆర్థిక లావాదేవీలు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలకు చేసిన డబ్బు పంపిణీ వివరాలు అందులో ఉన్నాయని ఆయన తెలిపారు. అయితే ఈ రెడ్ డైరీ అంశాన్ని ప్రస్తావించగానే సభలో గందరగోళం నెలకొన్నది.
రాజేంద్రసింగ్తో ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఘర్షణకు దిగారు. రెడ్ డైరీ (Red Dairy) రహస్యాలను సభకు వివరించేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆయన వెల్లోకి దూసుకెళ్లారు. అయితే మాట్లాడేందుకు స్పీకర్ అనుమతించలేదని, మంత్రి శాంతికుమార్ ధరివాల్తో పాటు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనను ‘కొట్టి, తన్ని, అసెంబ్లీ నుంచి బయటకు లాగిపడేశారు’ అని రాజేంద్ర సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.