జైపూర్: రెండు గ్రూపుల మధ్య గొడవను ఆపేందుకు పోలీస్ కానిస్టేబుల్ ప్రయత్నించాడు. అయితే కొందరు వ్యక్తులు అతడి కంట్లో మట్టి చల్లి కొట్టడంతోపాటు కత్తిలో పొడిచి హత్య చేశారు. (Constable Stabbed To Death) రాజస్థాన్లోని సిరోహి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కానిస్టేబుల్ నిరంజన్ సింగ్ సరూప్గంజ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి మహాశివరాత్రి ఉత్సవాలు జరిగిన లౌటానా గ్రామంలో డ్యూటీలో ఉన్నాడు.
కాగా, మధ్య రాత్రి వేళ జాతరలో పాల్గొన్న రెండు వర్గాల యువకుల మధ్య వివాదం తలెత్తింది. రెండు గ్రూపుల మధ్య ఘర్షణను నివారించేందుకు పోలీస్ కానిస్టేబుల్ నిరంజన్ సింగ్ ప్రయత్నించాడు. ఆగ్రహానికి గురైన కొందరు వ్యక్తులు ఆ పోలీసుపై దాడి చేశారు. కంట్లో మట్టి చల్లి కిందకు తోశారు. ఆపై కత్తితో పొడిచి చంపి అక్కడి నుండి పారిపోయారు.
మరోవైపు నిందితుల్లో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. మిగిలిన వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కాగా, కానిస్టేబుల్ నిరంజన్ సింగ్ హత్యపై రాజస్థాన్ సీఎం భజన్ లాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రూ. 1.35 కోట్ల పరిహారం ప్రకటించారు. అతడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.