జైపూర్: మహిళల భద్రతపై సొంత ప్రభుత్వంపైనే రాష్ట్ర మంత్రి విమర్శలు గుప్పించారు. దీంతో గంటల వ్యవధిలోని ఆయనపై ముఖ్యమంత్రి వేటువేశారు. రాజస్థాన్ (Rajasthan) సీఎం అశ్క్ గెహ్లాట్ (CM Ashok Gehlot) కేబినెట్లో సైనిక్ కల్యాణ్ (స్వతంత్ర బాధ్యత), హోంగార్డు, పౌర రక్షణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా రాజేంద్ర గుడా (Rajendra Gudha) బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీలో రాజస్థాన్ కనీస ఆదాయ హామీ బిల్లు-2023పై (Rajasthan Minimum Income Guarantee Bill) శుక్రవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా సొంత పార్టీకే చెందిన ఎమ్మెల్యేలు మణిపూర్లో (Manipur) ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో బిల్లుపై చర్చకు అంతరాయం ఏర్పడింది.
దీంతో కలుగజేసుకున్న రాజేంద్ర గుడా.. సొంత రాష్ట్రంలోనే మహిళలకు రక్షణ లేదు, పొరుగు రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మణిపూర్ హింసాకాండను రాష్ట్ర అసెంబ్లీలో లేవనెత్తే బదులు సొంత ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. రాజస్థాన్లోని మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమైన తీరు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని సొంత ప్రభుత్వంపైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
రాజస్థాన్లో మన తల్లులు, సోదరీమణులపై లైంగిక వేధింపుల ఘటనలు జరుగుతున్నాయి, తన సొంత అసెంబ్లీ నియోజకవర్గమైన ఉదయ్ పూర్వతిలోని మహిళలకు తాను రక్షణ కల్పిస్తాని నమ్మి ఎన్నికల్లో గెలిపించారు.. కానీ మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో నాలుగు నెలల్లో జరుగునున్న ఎన్నికల్లో ప్రజల వద్దకు ఎలా వెళ్తామని ప్రశ్నించారు.
దీంతో ఆయనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వేటు వేశారు. మంత్రి పదవి నుంచి తొలగిస్తూ గవర్నర్కు సిఫారసు చేశారు. మంత్రిగా రాజేంద్ర గూడాను తొలగిస్తూ ముఖ్యమంత్రి పంపిన సిఫారసును గవర్నర్ కల్రాజ్మిశ్రా (Governor Kalraj Mishra) వెంటనే ఆమోదించారు. ఈ మేరకు రాజస్థాన్ గవర్నర్ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది.