న్యూఢిల్లీ: రాజస్థాన్లో (Rajasthan) స్వపక్షంలో విపక్షంగా ఉన్న సీఎం అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot), పార్టీ సీనియర్ నేత సచిన్ పైలట్ (Sachin Pilot)తో కాంగ్రెస్ (Congress) జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) సమావేశం కానున్నారు. నేడు ఇరువురు నేతలతో ఖర్గే వేర్వేరుగా భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీఎం, మాజీ ఉప ముఖ్యమంత్రికి రాజీ కుదిర్చేందుకు, వారిమధ్య ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా ఈ సమావేశం జరుగునున్నట్లు తెలుస్తున్నది. గత బీజేపీ (BJP) ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి 15 రోజుల్లో విచారణ జరిపించాలని ఈ నెలాఖరు వరకు ప్రభుత్వానికి సచిన్ గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఇరువురు నేతలతో ఖర్గే సమావేశం కానున్నట్లు సమాచారం.
కాగా, సీఎం అశోక్ గెహ్లాట్పై పోరుబాట పట్టిన సచిన్ పైలట్ వసుంధర రాజే (Vasundhara Raje) నేతృత్వంలోని గత బీజేపీ ప్రభుత్వం అవినీతిపై 15 రోజుల్లో చర్యలు చేపట్టాలని ఈ నెల 15న అల్టిమేటమ్ ఇచ్చారు. లేని పక్షంలో సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనను రాష్ట్రవ్యాప్తంగా తీవ్రం చేస్తానని హెచ్చరించారు. ఇందులో భాగంగా అశోక్ గెహ్లాట్పై ఒత్తిడి తెచ్చేందుకు ఆయన జన సంఘర్షణ్ పేరుతో అజ్మీర్ నుంచి జైపూర్ వరకు ఐదు రోజుల పాదయాత్ర నిర్వహించారు.
బీజేపీ పాలనలో రాష్ట్రంలో చోటుచేసుకున్న అవినీతి, ప్రభుత్వ రిక్రూట్మెంట్ పరీక్షల పేపర్ల లీకేజీ తదితర అంశాలపై విచారణకు డిమాండ్ చేశారు. ‘అవినీతికి వ్యతిరేకంగా తాను, సీఎం గెహ్లాట్ పోరాడాం. కానీ ఇప్పుడు ఆయన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. బీజేపీ నాయకురాలు, మాజీ సీఎం వసుంధరా రాజే హయాంలో జరిగిన అవినీతిపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలి. ప్రస్తుతం ఉన్న రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను రద్దు చేసి కొత్త కమిషన్ను ఏర్పాటు చేయాలి. పేపర్ లీకేజీ కారణంగా నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలి. 15 రోజుల్లోగా గెహ్లాట్ సర్కారు ఈ డిమాండ్లపై స్పందించాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉద్ధృతం చేస్తా’ అని పైలట్ హెచ్చరించిన విషయం తెలిసిందే.
తాను చేపట్టబోయే ఆందోళన మూలంగా తలెత్తే ఎలాంటి పరిణామాలకు భయపడబోనని, చివరి శ్వాస వరకు ప్రజల కోసమే పోరాడుతానని సచిన్ పైలట్ తెగేసి చెప్పారు. చాలారోజులుగా సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. వసుంధర రాజే హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల సచిన్ పైలట్ ఒకరోజు నిరాహార దీక్ష చేయగా.. అశోక్ గెహ్లాట్ ఆమెను పొగడ్తల్లో ముంచెత్తారు. దాంతో వారి మధ్య విభేదాలు మిరంత తీవ్రమయ్యాయి. సీఎం గెహ్లాట్ కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీని కాకుండా వసుంధరా రాజేను తన నాయకురాలిగా భావిస్తున్నాడంటూ పైలట్ ఎద్దేవా చేశారు.