న్యూఢిల్లీ/జైపూర్: ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని మొబైల్ ఫోన్లలో వీక్షించినందుకు అజ్మీర్లోని రాజస్థాన్ సెంట్రల్ యూనివర్సిటీ 11 మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఏబీవీపీ చేసిన ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకోవడం గమనార్హం. గురువారం తమ హాస్టల్ రూమ్లలోకి ఏబీవీపీ నేతలు బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించి రచ్చ చేశారని, ‘జై శ్రీరామ్, దేశద్రోహులను కాల్చిపారేయాలి’ అంటూ నినాదాలు చేశారని సస్పెండైన విద్యార్థులు పేర్కొన్నారు.
ప్రజలకు హక్కు ఉందా? లేదా?
బీబీసీ లఘుచిత్రాన్ని కేంద్రం నిషేధించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. మోదీ సర్కార్ నిర్ణయం దురుద్దేశంతో కూడుకొన్నదని, ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధమని న్యాయవాది ఎంఎల్ శర్మ పేర్కొన్నారు. బీబీసీ డాక్యుమెంటరీ రెండు పార్టులను పరిశీలించాలని, గుజరాత్ అల్లర్ల ఘటనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
గుజరాత్ అల్లర్లకు సంబంధించి వార్తలు, వాస్తవాలు, రిపోర్టులను చూసేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కింద ప్రజలకు హక్కు ఉందా లేదా సుప్రీంకోర్టు నిర్ణయించాలని రాజ్యాంగపరమైన ప్రశ్నను లేవనెత్తారు. డాక్యుమెంటరీని బ్యాన్ చేస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలని కోరారు. మరోవైపు భారత్లో బీబీసీ మీడియా సంస్థను నిషేధించాలంటూ హిందూ సేన కార్యకర్తలు దేశ రాజధాని ఢిల్లీలోని బీబీసీ కార్యాలయం బయట బోర్డులు పెట్టారు.
రాజ్యాంగ స్వరూపాన్ని మార్చే కుట్రలు
బీబీసీ డాక్యుమెంటరీతో పాటు అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ రిసెర్చ్ నివేదిక అంశాలపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మోదీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని డీఎంకే నిర్ణయం తీసుకొన్నది. శనివారం జరిగిన ఎంపీల సమావేశంలో డీఎంకే అధినేత, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మార్గనిర్దేశం చేశారు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వ్యతిరేకించాలని ఎంపీలకు సూచించారు.