మల్బరీ పంటను ప్రోత్సహిస్తున్న సర్కారు
నచ్చన్ఎల్లాపూర్లో 20 ఎకరాల్లో పెంపకం
ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు ప్రభుత్వ రాయితీలు
కడెం, ఏప్రిల్ 4: మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ సమీపంలో ఏర్పాటు చేసిన మల్బరీ మొక్క ల పెంపక కేంద్రం పట్టు సాధించే దిశగా అడుగులు వేస్తున్నది. ఈ కేంద్రంలో లక్ష మల్బరీ, 20 వేల మద్ది మొక్కలు, 57 ఆయిల్పామ్ మొక్కలను పెంచుతున్నారు. ఇక్కడ పెరిగిన మొక్కలను రైతుల అవసరాల మేరకు పంపిణీ చేస్తున్నారు. తక్కువ కాలంలో పూర్తయ్యే ఈ పంటపై రైతులు మరింత ఆసక్తి చూపించేలా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. దీని కోసం ఇద్దరు ఫీల్డ్ అధికారులు గ్రామాల్లోని రైతులను కలిసి మల్బరీతోట వల్ల కలిగే లాభాలను వివరిస్తున్నారు. ఇక్కడ నర్సరీ నిర్వహణకు మరో నలుగురు సిబ్బంది ఉన్నారు. ఈ యేడు ఇక్కడి నుంచి 50 వేల మొక్కలను రైతులకు అందించినట్లు అధికారులు చెబుతున్నారు. కడెం మండలంలోని లింగాపూర్, ధర్మాజిపేట, దిల్దార్నగర్, నచ్చన్ఎల్లాపూర్, నిజామాబాద్, భైంసా ప్రాంతాలకు చెందిన రైతులకు మొక్కలను సరఫరా చేశారు. అయితే ఒక్కసారి మొక్కలను తీసుకొని నాటిన అనంతరం రైతు తిరిగి మొక్కలను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదంటున్నారు అధికారులు.
మల్బరీ తోటతో ప్రయోజనాలు
మల్బరీతోట తక్కువకాలం పంట. కేవలం మూడు నెలల్లో ఈ పంటకాలం పూర్తవుతుంది. నర్సరీ నుంచి మొక్కలు తీసుకున్న అనంతరం రైతు చేనులో నాటితే మూడు నెలల్లో 3 నుంచి 5 అడుగుల ఎత్తు పెరుగుతుంది. దీనికి కావాల్సిన మందులు, అవి వాడే విధానాన్ని అధికారులు రైతులకు వివరిస్తారు. అయితే మొక్కలు కావాల్సిన రైతులు ముందుగా పట్టుపరిశ్రమశాఖ పేరిటా రూ. 11 వేలు డీడీ తీయాల్సి ఉంటుంది. ఎకరానికి 5500 మొక్కలను పంపిణీ చేస్తారు. ఈ మల్బరీతో రైతులకు జంతువుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మొదటి పంట మూడు నెలల కాలంలో పూర్తయితే దానిని మధ్యలో తొలగిస్తారు. అయితే మల్బరీ పెరుగుతున్న సమయంలో అధికారుల సలహాలతో రైతులు పట్టు పురుగులను పెంచేందుకు షెడ్డు నిర్మాణం చేయాల్సి ఉంటుంది. దీనికి ప్రభుత్వం నుంచి ఎస్సీ, ఎస్టీలకు రూ. 2లక్షల60 వేలు, బీసీలకు రూ. 2లక్షల 25 వేల చొప్పున అందుతుంది. అలాగే ఎరువులు, జాలీలు (చంద్రికలు), ఇతర నిర్వహణ (మెయింటనెన్స్) కోసం 50 శాతం సబ్సిడీ అందజేస్తుంది.
ఒక్కసారి నాటితే ..
మల్బరీ మొక్కలను ఒక్కసారి నాటితే సరిపోతుంది. మిగిలిన కాడలను తిరిగి రెండో పంటగా ఉపయోగిస్తారు. దానికి కేవలం 2 నుంచి 3 నెలల కాలం మాత్రమే పడుతుంది. అనంతరం అవే కాడలను రెండో పంటగా తిరిగి నాటుతారు. అవే కాడలతో మూడో పంట కాలం 3 నెలలు ఉంటుంది. అంటే ఒక్కసారి మొక్కలను కొనుగోలు చేస్తే అవి మూడు పంటలకు ఉపయోగపడుతాయి. 10 నుంచి 12 నెలల కాలంలోనే మూడు పంటలను తీయవచ్చు. 3 నుంచి 5 అడుగులు పెరిగిన చెట్ల ఆకులతో రైతులు తక్కువ పెట్టుబడితో లాభాలు పొందవచ్చని, ఆసక్తి గల వారు మొక్కలు తీసుకెళ్లవచ్చని అధికారులు చెబుతున్నారు.
రైతులు తీసుకోవాల్సి జాగ్రత్తలు
రైతులు మల్బరీ సాగు చేస్తున్న సమయంలో షెడ్డు నిర్మించుకోవాల్సి ఉం టుంది. షెడ్డు నిర్మాణం పూర్తయిన అనంతరం పట్టు పురుగుల గుడ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక్క ఎకరానికి 100 గుడ్లు అవస రం. వీటి నుంచి దాదాపు 30 వేల వరకు పిల్లలు ఉత్పత్తి అవుతాయి. ఒక్కో గుడ్డుకు రవాణా చార్జీతో రూ. 6 ఖర్చవుతుంది. ఈ గుడ్లను అనంతపూర్, చిత్తూరుకు వెళ్లి తీసుకురావాల్సి ఉంటుంది. 50 గుడ్లను ఒక్క ట్రే (బ్లాక్సు)లలో భద్రపరుచుకోవాలి. గుడ్లపై మల్బరీ ఆకులను పేర్చాలి. గుడ్లు పగిలి అందులో నుంచి పిల్లలు బయటకు వస్తాయి. తర్వాత 30 రోజుల పాటు మల్బరీ ఆకులను ఆహారంగా తీసుకుంటాయి. దీంతో పురుగుల్లో పట్టు (నూలు) పెరిగే స్థాయి వస్తుంది. అవి షెడ్డులోని జాలీలను ఏర్పాటు చేసుకొని అందులో వేస్తారు. 30 రోజులు మల్బరీ ఆకులను తిన్న పురుగులకు ఆకులను దాణాగా పెడుతారు. ఇందులో దాదాపు 9 నుంచి 12 రోజుల వరకు పెరుగుతూ ఆకులను తింటాయి. అనంతరం ప్రత్యేక జాలీలను పురుగులపైన అమర్చుతారు. అందు లోని పురుగులు పైన అమర్చిన జాలీలకు ఎగబాకి పట్టు (నూలు)ను విడుదల చేస్తాయి. దీనిని విక్రయించేందుకు ఇక్కడి రైతులు హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లోని హిందుపూర్కు తీసుకెళ్తారు. అయితే కిలో పట్టుకాయలకు రూ. 440 వరకు ధర వస్తున్నది. దీనికి ప్రభుత్వం మరో రూ. 75 బోనస్ కలిపి రైతులకు అందజేస్తున్నది.
మల్బరీతో లాభాలు
మల్బరీ పంట వల్ల రైతులకు మంచి లాభాలున్నాయి. ఒక్క ఏడాదిలో రైతులు మూడు పంటలు సాగే చేసే ఆస్కారం ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతులు మరింత ముందుకు వచ్చి మంచి లాభాలు గడించవచ్చు. రూ. 2 చొప్పున రైతులకు మల్బరీ మొక్కలను పంపిణీ చేస్తున్నాం. వారికి సలహాలు, సూచనలు చేయడంతో పాటు, షెడ్డు నిర్మాణం కోసం సర్కారు సాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
బిక్యానాయక్, ఫీల్డ్ అధికారి, నచ్చన్ఎల్లాపూర్ (కడెం).
ఇవి కూడా చూడండి..
జవాన్ల మృతిపట్ల మంత్రి ఎర్రబెల్లి సంతాపం
ఫాల్కే అవార్డును దోస్త్ రాజ్ బహదూర్కు అంకితం చేస్తున్నా: రజినీకాంత్