న్యూఢిల్లీ: మన భారతీయ రైళ్ల గురించి తెలుసు కదా. అవి ఆలస్యం కాని రోజంటూ ఉండదు. అలా ఆలస్యమైన రైలు కారణంగా ఓ ప్రయాణికుడు తన ఫ్లైట్ మిస్ చేసుకున్నాడు. దీంతో సదరు ప్రయాణికునికి రూ.30 వేల పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఇండియన్ రైల్వేస్ను ఆదేశించింది. ఓ రైలు ఆలస్యంపై ప్రయాణికులు వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేసిన సందర్భంలో.. ఆ రైలు ఆలస్యానికి రైల్వేస్ సరైన కారణంగా చెప్పలేకపోతే పరిహారం చెల్లించాల్సిందే అని ఎంఆర్ షా, అనిరుద్ధ బోస్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
ప్రయాణికుల సమయం చాలా విలువైనదని, అందువల్ల దీనికి ఎవరో ఒకరిని బాధ్యులను చేయాల్సిందే అని కోర్టు తేల్చి చెప్పింది. ఈ రోజుల్లో పోటీ చాలా తీవ్రంగా ఉంది. అదే సమయంలో బాధ్యతగా కూడా వ్యవహరించాలి. ఒకవేళ ప్రజా రవాణా వ్యవస్థ మనుగడ సాగించాలంటే కచ్చితంగా పనితీరు మెరుగు పరచుకోవాల్సిందే అని కోర్టు తెలిపింది.
ఐదేళ్ల కిందటి కేసు..
సంజయ్ శుక్లా అనే ప్రయాణికుడు రైల్వేస్పై ఈ కేసు వేశాడు. అతనితోపాటు కుటుంబం మొత్తం రైలు ఆలస్యం కారణంగా ఎక్కాల్సిన విమానం మిస్సయింది. 2016, జూన్ 11న ఇది జరిగింది. జమ్ము నుంచి శ్రీనగర్ వెళ్లాల్సిన విమానం మధ్యాహ్నం 12 గంటలకు ఉండగా.. ఉదయం 8.10 గంటలకు జమ్ము రావాల్సిన రైలు నాలుగు గంటలు ఆలస్యం అయింది. దీంతో ఆ ప్రయాణికుడు జమ్ము నుంచి శ్రీనగర్కు రూ.15 వేలు పెట్టి ట్యాక్సీలో వెళ్లాల్సి వచ్చింది.
దీంతో తనకు పరిహారం ఇవ్వాలంటూ అతడు కోర్టుకెక్కాడు. రైల్వేస్ తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదిస్తూ.. ఇండియన్ రైల్వేస్ కాన్ఫరెన్స్ అసోసియేషన్ కోచింగ్ టారిఫ్ నంబర్ 26లోని రూల్ 114, 115 ప్రకారం.. ఎలాంటి పరిహారం చెల్లించడానికి రైల్వేస్ బాధ్యత వహించదని అన్నారు. ఆ వాదనను కోర్టు కొట్టేసింది. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర, జాతీయ వినియోగదారుల ఫోరమ్స్ ఇచ్చిన ఆదేశాల మేరకు రూ.30 వేల పరిహారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.