లక్నో: రైల్వే ఉద్యోగి అయిన వ్యక్తి తన కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. భర్త, కుటుంబ సభ్యులు కూడా అదనపు కట్నం కోసం తనను వేధించినట్లు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. (Railway employee raps daughter-in-law) ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. రైల్వేలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా పనిచేస్తున్న 58 ఏళ్ల వ్యక్తి కుమారుడితో ఒక మహిళకు 2023 నవంబర్లో పెళ్లి జరిగింది.
కాగా, వివాహం కోసం తన కుటుంబం సుమారు రూ. 55 లక్షలు ఖర్చు చేసినట్లు ఆ మహిళ తెలిపింది. పెళ్లైన మొదటి రాత్రే ఇద్దరు ఆడపడుచులు బలవంతంగా మద్యం తాగించి, సిగరెట్ స్మోక్ చేయించినట్లు ఆరోపించింది. తాను నిరాకరించగా గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించారని, దీంతో తన ఆరోగ్యం క్షీణించినట్లు చెప్పింది. భర్త, ఆడపడుచులు తరచుగా స్నేహితులతో కలిసి ఇంట్లో పార్టీలు నిర్వహించేవారని, మామకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె పేర్కొంది.
మరోవైపు పుట్టింటికి వెళ్ళిన తాను 2024 ఏప్రిల్లో అత్తవారింటికి చేరుకున్నట్లు ఆ మహిళ తెలిపింది. తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ బలవంతంగా మద్యం తాగించారని ఆమె చెప్పింది. తాను మత్తులో ఉన్న సమయంలో మామ తనపై అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. పోలీసులకు సమాచారం అందించే వరకు భర్త, అత్తమామలు తనను మూడు రోజుల పాటు బందీగా ఉంచారని ఆమె తెలిపింది.
అయితే, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి వెళ్లి ఆ మహిళను రక్షించారు. ఆమె ఫిర్యాదుతో మామపై తొలుత లైంగిక వేధింపులకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అత్యాచారానికి సంబంధించిన ఆధారాలు లభించడంతో ఆ సెక్షన్ కూడా చేర్చారు. పరారీలో ఉన్న ఆ రైల్వే ఉద్యోగిని శనివారం అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.