న్యూఢిల్లీ: రైలు ప్రయాణం రానున్న రోజుల్లో మరింత భారం కానున్నది. నవీకరించిన లేదా భవిష్యత్తులో నవీకరించే స్టేషన్లలో రైలు ఎక్కినా, దిగినా ప్రయాణికులపై అదనపు చార్జీ విధించాలని రైల్వేశాఖ భావిస్తున్నది. టికెట్ రుసుముతో పాటు యూజర్ ఫీజు కింద అదనంగా రూ. 10-రూ.50ని వసూలు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నవీకరించిన స్టేషన్లో ఎక్కి.. నవీకరించిన స్టేషన్లో ప్రయాణికుడు దిగితే డబుల్ యూజర్ ఫీజు వసూలు చేస్తారు. ఆమోదం కోసం రైల్వేశాఖ ఈ ప్రతిపాదనలను క్యాబినెట్కి ఇప్పటికే పంపించినట్టు సమాచారం. విమాన టికెట్ల బుకింగ్ మాదిరిగా.. టికెట్ బుకింగ్ చేసుకునే సమయంలోనే ఈ అదనపు చార్జీలు తుది రుసుముతో కలుస్తాయి.