న్యూఢిల్లీ : కరోనా మొదటి దశ నుంచి ప్రస్తుతం బెడ్షీట్లు, దుప్పట్ల ఇవ్వడాన్ని రైల్వేశాఖ నిలిపివేసింది. శీతాకాలం ప్రారంభం కావడంతో రైళ్లలో బెడ్రోల్కు డిమాండ్ పెరుగుతున్నది. ఈ క్రమంలో ప్రయాణిలకు మళ్లీ బెడ్రోల్స్ (దుప్పటి, బెడ్షీట్, దిండు) అందుబాటులో ఉంచేందుకు కసరత్తులు చేస్తున్నది. ఈ విషయమై సమీక్ష నిర్వహిస్తున్నామని, త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీతో సహా పలు రైల్వే విభాగాలు రైళ్లలో ఆన్ బోర్డ్ ఆన్ డిమాండ్ కింద డిస్పోసబుల్ ట్రావెల్ బెడ్రోల్ కిట్ను అందించనున్నాయి. దీనికి రూ.300 వరకు చెల్లించాల్సి ఉంటుంది. కరోనా మొదటి వేవ్ తర్వాత రైల్వేశాఖ సర్వీసులను నిలిపివేసింది.
మహమ్మారి ఉధృతి కాస్త తగ్గిన తర్వాత పలు మార్గాల్లో రైళ్లను ప్రారంభించింది. మళ్లీ సెకండ్ వేవ్తో మళ్లీ పలు మార్గాల్లో రైళ్లు రద్దయ్యాయి. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తగ్గుతున్నా ఇప్పటికీ చాలా మార్గాల్లో రైళ్లను ప్రారంభించలేదు. కొవిడ్ నిబంధనలతో ప్రస్తుతం 95శాతం రైళ్లు నడుస్తున్నాయి. వీటిలో 90 శాతానికి పైగా బెర్తులు రిజర్వు అవుతున్నాయి. కానీ, గతంలో మాదిరిగా ప్రీమియం, మెయిల్ ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలోని ఏసీ కోచ్లలో బెడ్రోల్ సౌకర్యం ఇంకా ప్రారంభం కాలేదు. ప్రయాణికులు ఇంటి నుంచి బెడ్ షీట్స్, దుప్పట్లనే తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ రైల్వే డివిజన్ 50కిపైగా ఏసీ, సాధారణ కోచ్లలో ప్రయాణించే వారి కోసం డిస్పోజబుల్ కిట్లను అందుబాటులోకి తెచ్చింది.
డిస్పోజబుల్లో రైల్వే మూడు రకాల కిట్లను అందుబాటులో ఉంచింది. రూ.300 విలువైన కిట్లలో ప్రయాణికులకు బ్లాంకెట్, దిండు ( నేసినవి కావు), డిస్పోజబుల్ బ్యాగ్, టూత్పేస్ట్, టూత్ బ్రష్, హెయిర్ ఆయిల్, దువ్వెన, శానిటైజర్ సాచెట్, పేపర్ సోప్, టిష్యూ పేపర్ ఇవ్వనున్నారు. రూ.150 విలువైన మరో కిట్లో కేవలం దుప్పటి మాత్రమే ఇస్తారు. రూ.30 విలువైన మార్నింగ్ కిట్లో టూత్పేస్ట్, టూత్ బ్రష్, హెయిర్ ఆయిల్, దువ్వెన, శానిటైజర్ సాచెట్, పేపర్ సోప్, టిష్యూ పేపర్ అందనున్నాయి. స్లీపర్, ఏసీ కోచ్లలో ప్రయాణికులకు బెడ్ రోల్స్ అందించే సౌకర్యం కరోనా మహమ్మారికి ముందు అందుబాటులో ఉండేది. కొవిడ్ అనంతర పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు రైల్వే దుప్పట్లు అందించడాన్ని నిలిపివేసింది. ప్రస్తుతం మళ్లీ ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు.