జైపూర్, నవంబర్ 3: అసెంబ్లీ ఎన్నికల వేళ రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం దాడులు చేసింది. జల్ జీవన్ మిషన్ కుంభకోణంలో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణపై రాజధాని జైపూర్, దౌసలలోని 25 చోట్లతో పాటు ఐఏఎస్ అధికారి సుబోధ్ అగర్వాల్ ఇంటిపై ఈడీ దాడులు చేసి తనిఖీలు నిర్వహించింది.
సెప్టెంబర్లో సైతం ఈడీ ఇదే విధంగా దాడులు చేసింది. కాగా, ఈ నెల 25న రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, ఈ క్రమంలో విపక్షాలను లక్ష్యంగా చేసుకుని కేంద్రంలోని బీజేపీ ఇచ్చే ఆదేశాల మేరకు దర్యాప్తు సంస్థలు ఇలాంటి దాడులకు దిగుతున్నాయని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. ప్రతి ఇంటికి నల్లాల ద్వారా సురక్షితమైన మంచినీటిని అందించే లక్ష్యంతో కేంద్రం జల్ జీవన్ మిషన్ను ప్రారంభించింది. అయితే ఈ పథకం అమలును రాజస్థాన్లోని పీహెచ్ఈ శాఖ చేపట్టింది. ఈ పథకంలో బోలెడు అవకతవకలు చోటుచేసుకున్నట్టు అధికారంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.