Rahul on Sriram | రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్లో కొనసాగుతున్నది. అగర్-మాల్వాలో శుక్రవారం రాత్రి జరిగిన ఒక బహిరంగసభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఇకపై జై శ్రీరామ్ అనకుండా జై సియారామ్ అనాలని రాహుల్ బీజేపీ నేతలకు సలహా ఇచ్చారు. ఇదే సమయంలో రెండింటికి మధ్య వ్యత్యాసాన్ని కూడా విడమరిచి చెప్పారు. కాగా, రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. రాహుల్ డ్రామా ట్రూప్ నాయకుడని విమర్శిస్తున్నారు.
‘జై సియారామ్ అంటే ఏంటి? జై సీత, జై రామ్. సీత, రాముడు ఒక్కటే. అందుకే జై సియారామ్ లేదా జై సీతారామ్ అనాలి. రాముడు సీత గౌరవం కోసం పోరాడాడు. సమాజంలో సీతలాంటి స్త్రీలను జయ సియారామ్ అని పిలువాలి. జై శ్రీరామ్ అంటే ఇందులో రాముడికొక్కడికే నమస్కారం చెప్తున్నట్లుగా ఉంటుంది. సమాజాన్ని ఏకం చేసే పనిని రాముడు చేపట్టాడు. రాముడు అందరికీ గౌరవం ఇచ్చాడు. ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్లు రాముడి జీవన విధానాన్ని ఏమాత్రం అనుసరించడం లేదు. వారి సంస్థలో సీత లేనందున వారు సియారామ్ అని, హే రామ్ అని అనరు. సీతను బయటకు విసిరేశారు. హే రామ్ అంటే రాముడి జీవన విధానం. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్లకు నిజంగా శ్రీరాముడిపై భక్తి ఉంటే జై శ్రీరామ్కు బదులుగా జై సితారామ్ అనగలరా?’ అని రాహుల్ ప్రశ్నించారు.
రాహుల్ ప్రకటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాహుల్ సర్టిఫికేట్ ఏదీ బీజేపీకి అక్కర్లేదని షానవాజ్ హుస్సేన్ చెప్పారు. రాహుల్, కాంగ్రెస్ నేతలు ఎన్నికైన హిందువులని ఆయన విమర్శించారు. బ్రజేష్ పాఠక్ స్పందిస్తూ.. రాహుల్ ఓ డ్రామా ట్రూప్కు నాయకుడు మాత్రమేనన్నారు. ఆయనకు భారతీయ సంస్కృతి గురించి ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. ఓ వీధి నుంచి మరో వీధికి పరిగెత్తడం మాత్రమే రాహుల్కు తెలుసునన్నారు. జోడో యాత్రలో విరామం దొరగ్గానే భారతదేశ చరిత్ర, సంస్కృతి పుస్తకాలు చదవాలని రాహుల్కు మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తం మిశ్రా సలహా ఇచ్చారు.