బెంగళూర్ : బీజేపీ ప్రజల్లో చీలికను తీసుకువచ్చి కర్నాటకలో విద్వేషం వెదజల్లుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. కాషాయ దళానికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో సామరస్యాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్య పాలన ఆదర్శంగా సాగిందని, రాష్ట్ర ప్రజలను ఆయన సరైన దిశలో నడిపించారని ప్రస్తుత బీజేపీ పాలన అందుకు భిన్నంగా సాగుతోందని ఆరోపించారు.
సిద్ధరామయ్య 75వ జన్మదిన వేడుకలకు హాజరైన రాహుల్ గాంధీ మాజీ సీఎంపై ప్రశంసలు గుప్పించారు. 2023 ఎన్నికల్లో పార్టీ నేతలు సమైక్యంగా కాషాయ సర్కార్కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు ఇచ్చారు. దావణగెరెలో జరిగిన కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతూ తాను సాధారణంగా బర్త్డే వేడుకలకు హాజరు కానని, అయితే సిద్ధరామయ్యతో ఉన్న ప్రత్యేక అనుబంధంతోనే వచ్చానని చెప్పుకొచ్చారు.
సిద్ధరామయ్యను వ్యక్తిగా అభిమానించడంతో పాటు ఆయన ఆశయాలనూ పంచుకుంటానని చెప్పారు. పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చూపే చొరవ ప్రశంసనీయమని అన్నారు. కర్నాటకలో ప్రభుత్వాన్ని సిద్ధరామయ్య నడిపిన తీరును రాహుల్ కొనియాడారు. ఇక కర్నాటకలో రానున్న అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి రేస్లో సిద్ధరామయ్యతో పాటు కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, సీనియర్ నేత ఎస్ఆర్ పాటిల్ పోటీపడుతున్నారు.