Rahul Gandhi: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) కు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయి. ప్రస్తుతం అసోంలో ఆయన యాత్ర సాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించేందుకు రాహులగాంధీ వెళ్లగా అధికారులు ఆయనకు అనుమతి నిరాకరించారు. దాంతో కార్యకర్తలతో కలిసి ఆయన బైఠాయించారు.
అనంతరం రాహుల్గాంధీ షెడ్యూల్ ప్రకారం మోరిగావ్ జిల్లాలో పాదయాత్రకు ఉపక్రమించారు. కానీ పాదయాత్రకు జిల్లా అధికార యంత్రాంగం బ్రేకులు వేసింది. అదేవిధంగా ఇవాళ సాయంత్రం బిహుతోలిలో నిర్వహించతలపెట్టిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్కు కూడా జిల్లా యంత్రాంగం అనుమతి నిరాకరించింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు దుండగులు ప్రయత్నించే అవకాశం ఉన్నందునే తాము రాహుల్ యాత్రకు అనుమతి నిరాకరిస్తున్నట్లు పేర్కొన్నది.
ఈ నేపథ్యంలో అసోం ప్రజలు తన యాత్రలో పాల్గొనకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని రాహుల్గాంధీ ఆరోపించారు. అంతకుముందు నగావ్ జిల్లాలోని బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించకుండా అధికారులు అడ్డుకోవడంతో రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడుల్లోకి ఎవరు ప్రవేశించాలనేది ఇప్పుడు ప్రధాని మోదీ నిర్ణయిస్తున్నారని విమర్శించారు. కాగా, అసోంలోని 17 జిల్లాల మీదుగా 833 కిలోమీటర్ల మేర రాహుల్ యాత్ర కొనసాగనుంది.