శివమొగ్గ, మే 2: హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ 400 మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డారని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలోని శివమొగ్గలో గురువారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘మాస్ రేపిస్ట్’కు ఓట్లేయమని అడిగినందుకు ప్రధాని మోదీ దేశ మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజ్వల్ 400 మందిపై అఘాయిత్యానికి పాల్పడి, వీడియోలు చిత్రీకరించాడని ఆరోపించారు. ఇది సెక్స్ కుంభకోణం కాదని, అతి పెద్ద అత్యాచార ఘటన అని పేర్కొన్నారు. ప్రజ్వల్ చేసిన అసభ్య పనుల గురించి మోదీకి ముందే తెలుసని ఆరోపించారు. ‘ప్రతి భారత మహిళను ప్రధాని అవమానించారు. ప్రధాని, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ నాయకులందరూ దేశంలోని ప్రతి మహిళకు క్షమాపణలు చెప్పాలి. ప్రపంచంలో ఏ నాయకుడూ ఇలా లైంగిక దాడులు చేసిన వ్యక్తికి ఎన్నికల ప్రచారం చేయరు’ అని రాహుల్ అన్నారు.
ప్రజ్వల్ను అరెస్ట్ చేసేందుకు లుక్ అవుట్ నోటీస్ జారీ చేసినట్టు కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర గురువారం తెలిపారు. ప్రజ్వల్ లైంగిక వేధింపుల గురించి మరో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. మరోవైపు జర్మనీకి విమాన ప్రయాణం చేసేందుకు డిప్లొమాటిక్ పాస్పోర్ట్ కలిగినవారికి వీసా అవసరం లేదని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ప్రజ్వల్ పాస్పోర్ట్ రద్దు గురించి తమకు ఇంకా ఏ కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు.
ప్రజ్వల్ సెక్స్ స్కాండల్ వీడియోలపై వివరాలన్నీ సిట్కు వెల్లడిస్తానని ప్రజ్వల్ మాజీ డ్రైవర్ కార్తీక్ గుర్తు తెలియని ప్రదేశం నుంచి పంపించిన వీడియో సందేశంలో పేర్కొన్నాడు. తాను బీజేపీ నేత దేవరాజె గౌడకు తప్ప ఇంకెవరికీ ఆ వీడియోలు ఇవ్వలేదని తెలిపాడు. మరోవైపు కార్తీక్ మలేషియాలో ఉన్నాడని.. అతడిని అక్కడికి ఎవరు పంపించారని జేడీ(ఎస్) కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి ప్రశ్నించారు. సెక్స్ స్కాండల్ వీడియోల విడుదల వెనుక రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆయన సోదరుడు సురేశ్ల హస్తం ఉన్నదని ఆరోపించారు. దీన్ని శివకుమార్ ఖండించారు.
ప్రజ్వల్ లైంగిక వేధింపుల కేసులో సహ నిందితుడు, జేడీ(ఎస్) ఎమ్మెల్యే రేవణ్ణ గురువారం ముందస్తు బెయిల్ కోసం బెంగళూరులోని ప్రజా ప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు. రేవణ్ణ బెయిల్ అభ్యర్థనపై ఏమైనా అభ్యంతరాలంటే మే 3 లోగా తెలపాలని కోర్టు సిట్ను ఆదేశించింది.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ను శ్రీ కృష్ణుడితో పోలుస్తూ కర్ణాటక అబ్కారీ మంత్రి రామప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఇలాంటి నీచమైన ఆలోచన దేశంలో ఎక్కడా చూడలేదు. ఆయన తాను గిన్నిస్ రికార్డు నెలకొల్పుతానని అనుకున్నారేమో. ప్రజ్వల్ కృష్ణుడి రికార్డును బ్రేక్ చేయాలనుకున్నారేమో’ అని అన్నారు.