Rahul gandhi | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన రాష్ట్రపతి ప్రసంగం సత్యానికి ఎంతో దూరంగా వుందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగంలో నిరుద్యోగం గురించి ఏమాత్రం మాట్లాడకపోవడం విడ్డూరమన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభలో మంగళవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గతేడాది మూడు కోట్ల మంది యువకులు దేశంలో ఉద్యోగాలను కోల్పోయారని, గత 50 ఏళ్లతో పోలిస్తే, నిరుద్యోగ సమస్య ప్రస్తుత కాలంలోనే అధికమైందని ఆయన మండిపడ్డారు. యూపీఏ హయాంలో 27 కోట్ల మందిని పేదరికం నుంచి బయట పడేశామని, కానీ ఎన్డీయే హయాంలో 23 కోట్ల మందిని పేదరికంలోకి నెట్టేశారని తీవ్రంగా మండిపడ్డారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లు రాష్ట్రపతి ప్రసంగంలో లేనేలేవని ఎద్దేవా చేశారు. ఆ ప్రసంగానికి ఓ దృక్పథమంటూ లేదని రాహుల్ ఎద్దేవా చేశారు.
సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు అభివృద్ధి పథంలో సాగకపోతే.. మేడిన్ ఇండియా అనేది కుదిరే పని కాదని రాహుల్ స్పష్టం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను విధ్వంసం చేసిందని, జీఎస్టీ, నోట్ల రద్దు ద్వారా వీటి పరిస్థితి దుర్భరమైందని విమర్శించారు. వీటికి చేయూత ఇవ్వడంలో మోదీ సర్కార్ విఫలమైందని రాహుల్ ఆరోపించారు.
మోదీ హయాంలో భారతీయులు రెండు రకాలు విభజింపబడ్డారని, ఒకరు ధనవంతులు కాగా, మరొకరు పేదలని రాహుల్ అభివర్ణించారు. ఈ పేదలకు సరైన ఉద్యోగాలు కూడా లేవని అన్నారు. దేశానికి సంబంధించిన ధనమంతా ఒకరిద్దరి చేతుల్లోనే బందీ అయిపోయిందని, సంపన్నుల ఇండియా, పేదల ఇండియాగా మార్చేశారని రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. .
భారత్ అనేది పలు రాష్ట్రాల సముదాయమని, రాజ్యం మాత్రం కాదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాలపై కేంద్రం ఎన్నటికీ పెత్తనం చెలాయించలేదని తేల్చి చెప్పారు. ఆయా రాష్ట్రాల ప్రజలు తమ దృక్పథంతోనే ఆలోచిస్తారని, ఇదే భారత దేశ బలమని పేర్కొన్నారు. అసలు ఎంత మంది ఉద్యోగాలిచ్చారన్న విషయమే కేంద్రం మాట్లాడడం లేదని ఎద్దేవా చేశారు. ఎందుకంటే మీరు మాట్లాడితే అవి జోకులని ప్రజలు భావిస్తారని రాహుల్ సెటైర్ వేశారు. అత్యధిక ఉద్యోగులు అసంఘటిత రంగంలోనే ఉన్నాయని, ఆ రంగం నుంచే ధనికులకు కేంద్రం డబ్బులిచ్చిందని విమర్శించారు. ఇలా చేయడం ద్వారా అసంఘటిత రంగాన్ని కుదేలు చేసేశారని, పైగా.. జీఎస్టీ, నోట్ల రద్దు ద్వారా వారి గొంతు నొక్కేశారని రాహుల్ విమర్శించారు.