న్యూఢిల్లీ : కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన ప్రతిపక్ష ఇండియా కూటమి బీటలు వారుతున్నది. కాంగ్రెస్ వైఖరితో మిత్రపక్షాల్లో అంతర్మథనం మొదలైంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వైఖరి బీజేపీకి లబ్ధి చేకూర్చేలా ఉన్నదని కూటమి పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ ‘వెన్నుపోటు’ రాజకీయాలతో ఇప్పటికే కూటమికి డీఎంకే, ఆప్ దూరమయ్యాయి. తాజాగా రాహుల్ చేసిన ‘హగ్’ వ్యాఖ్యలపై సీపీఎం ఫైర్ అయింది. కేరళలో రాజకీయ వైరుధ్యం కారుణంగా ఆ రాష్ట్ర మాజీ సీఎం విజయన్ను ఆలింగనం చేసుకోలేనన్న రాహుల్ వ్యాఖ్యలపై ఆ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ వైఖరి కూటమి ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నదని విజయన్ మండిపడ్డారు. ‘ప్రధాని మోదీని రాహుల్ ఆలింగనం చేసుకున్న ఫొటోలు ఇంటర్నెట్ అంతటా ఉన్నాయి. ఆయన ఎవర్ని ఆలింగనం చేసుకుంటారన్న దానిపై నాకు వ్యక్తిగతంగా ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ వ్యాఖ్యల వెనుక ఉన్న రాజకీయ ఉద్దేశమే ముఖ్యం. ఇండియా కూటమి పట్ల ఆయన వైఖరిని ఇవి ప్రతిబింబిస్తున్నాయి’ అని పేర్కొన్నారు.
రాహుల్ వ్యాఖ్యలపై సీపీఎం ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ ఎంఏ బేబీ మాట్లాడుతూ.. విజయన్ను ఆలింగనం చేసుకోవాలని రాహుల్ను ఎవరూ కోరలేదని, అయితే విజయన్ను అరెస్ట్ చేయాలన్న డిమాండ్ను ఆయన మానుకోవాలన్నారు. ‘కమ్యూనిస్టులకు హగ్స్ అవసరం లేదు. మాకు నిజాయితీ రాజకీయాలు అవసరం. రాహుల్గాంధీ.. మీ హగ్స్ మీ దగ్గరే పెట్టుకోండి. అయితే ప్రతిపక్ష నేతగా, విజయన్ లాంటి విపక్ష నేతలను గౌరవించండి’ సీనియర్ నాయకురాలు బృందా కారత్ హితవు పలికారు.
కాంగ్రెస్ వైఖరి నచ్చకే ఇండియా కూటమికి డీఎంకే, ఆప్ దూరమయ్యాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం, డీఎంకేతో దశాబ్దాల బంధాన్ని తెగదెంపులు చేసుకొని విజయ్ నేతృత్వంలోని టీవీకేతో కాంగ్రెస్ చేతులు కలిపింది. కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని, ఇక భవిష్యత్తులో ఆ పార్టీతో చేతులు కలిపే ప్రసక్తే లేదని డీఎంకే తేల్చిచెప్పింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి భేటీకి కూడా డీఎంకే హాజరు కాలేదు. కాంగ్రెస్ వైఖరి నచ్చక ఆప్ కూడా ఇండియా కూటమికి ఇంతకుముందే గుడ్బై చెప్పింది. ఢిల్లీ భేటీకి ఆ పార్టీ కూడా హాజరుకాలేదు.
కాంగ్రెస్తో జట్టుకడితే ఓటమి తప్పదనే వాదన బలపడుతున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో సమాజ్వాదీ పార్టీకి కాంగ్రెస్తో ముప్పు పొంచి ఉన్నదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సీట్ల కేటాయింపు సమయంలో చిచ్చు రేపడం, కేటాయించిన సీట్లలో 15-20 శాతం సీట్లలో కూడా గెలవలేకపోవడంతో కాంగ్రెస్ వల్ల కూటమి బలహీనపడి ఓటమిపాలు అయ్యే అవకాశం ఉన్నదని చెబుతున్నారు. బీహార్లో చేసినట్టుగా స్థానిక, రాష్ట్ర అంశాల నుంచి దృష్టిని మరల్చి, జాతీయ అంశాలను ఎన్నికల ప్రచారాంశాలుగా తెర మీదకు తెచ్చి విజయావకాశాలను కాంగ్రెస్ దెబ్బతీసే అవకాశం ఉందని చెబుతున్నారు. మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్తో వ్యవహరించినట్టుగా, గోల్డ్ స్మగ్లింగ్ కేసులో విజయన్తో వ్యవహరించినట్టుగా కాంగ్రెస్ బీజేపీ వ్యతిరేక శక్తులను బలహీనపరిచి అంతిమంగా కమలం పార్టీకే లబ్ధి చేకూరుస్తుందని పేర్కొంటున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఎలా ఎదుర్కోవాలన్న దానితో కాకుండా మిత్రపక్షం కాంగ్రెస్ను ఎలా మేనేజ్ చేయాలన్నది ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీకి సవాల్గా మారనున్నది.