Rahul Gandhi : విపక్ష ఇండియా కూటమి నుంచి బయటపడిన నితీష్ కుమార్ తిరిగి ఎన్డీయే కూటమిలో చేరి మళ్లీ బిహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఉదంతంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తొలిసారిగా స్పందించారు. నితీష్ కుమార్ అవసరం తమకు లేదని, బీజేపీ ఒత్తిడితోనే ఆయన యూటర్న్ తీసుకుని కాషాయ కూటమికి చేరువయ్యారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
బీజేపీకి కుల గణన భయం పట్టుకుందని ఆయన ఆరోపించారు. ఇక రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర బిహార్లోకి ప్రవేశించింది. బిహార్లో కుల గణన చేపట్టాలని తాను నేరుగా నితీష్ను కోరానని, తమతో పాటు ఆర్జేడీ సైతం సర్వేకు పట్టుబట్టాయని అన్నారు. కులగణనకు భయపడిన బీజేపీ ఈ ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూ నితీష్పై ఒత్తిడి పెంచిందని, దొడ్డిదారిన పారిపోయేందుకు నితీష్కు పాచిక విసిరిందని రాహుల్ దుయ్యబట్టారు.
ప్రజలకు సామాజిక న్యాయం కల్పించడం తమ కూటమి (ఇండియా బ్లాక్) బాధ్యతని, దీనికోసం తమకు నితీష్ అవసరం లేదని రాహుల్ స్పష్టం చేశారు. నితీష్ కుమార్ తరచూ ఎన్డీయే, మహాకూటమిల మధ్య దోబూచులాడటాన్ని ప్రస్తావిస్తూ సీఎం రాజ్భవన్కు వెళ్లి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి తిరిగి కారులో వస్తూ తన శాలువా రాజ్భవన్లో మరిచిపోయానని గుర్తుకువచ్చి తిరిగి వెళతారని, ఇంత త్వరగా రాజ్భవన్కు తిరిగివచ్చారేమిటని గవర్నర్ ప్రశ్నిస్తారని రాహుల్ చమత్కరించారు.
Read More :
KTR | రాడార్తో వినాశనమే.. మేం అందుకే రానియ్యలే..: కేటీఆర్