KTR | వికారాబాద్, జనవరి 29, (నమస్తే తెలంగాణ): రాడార్ కేంద్రంతో పర్యావరణం, పక్షులు, జీవవైవిధ్యం దెబ్బతింటుందని, పరిగికి, వికారాబాద్ జిల్లాకు నష్టం అయితదనే పదేండ్లు రాడార్ను రానివ్వలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సోమవారం పరిగిలోని ఎస్ గార్డెన్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో దామగుండం అడవి పరిరక్షణ సమితి సభ్యులు వెంకటయ్య, రాములు కేటీఆర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘అడవి పోతది, చెట్లు పోతయి, పర్యావరణం పోతది, మీదికెళ్లి రేడియేషన్ సమస్య వస్తది తప్ప, రాడార్ కేంద్రంతో లాభం లేదు, ఈ విషయం తెలుసుకాబట్టే మన ప్రభుత్వం ఉన్నప్పుడు రానివ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పది రోజుల్లోనే ఆగమాగంగా 12 లక్షల చెట్లను కొట్టేసే ప్రాజెక్టుకు జెండా ఊపింది’ అని తెలిపారు.
ఇంత జరుగుతున్నా పర్యావరణవేత్తలు, ప్రశ్నించే గొంతుకలు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. ఆనాడు రంజిత్రెడ్డి చొరవతో చేవెళ్ల నుంచి ఇక్కడికి జాతీయ రహదారిని విస్తరిద్దామంటే పెద్ద పెద్ద మర్రి చెట్లు పోతున్నాయని కొంతమంది కోర్టుకు పోయి చాలా రోజులు ఆపారని, వందల చెట్లు పోతుంటేనే ఆగం చేస్తే, మరి 12 లక్షల చెట్లు పోతుంటే ప్రశ్నించే గొంతులు ఎక్కడ? అని నిలదీశారు. అద్భుతమైన ప్రాంతం వికారాబాద్ జిల్లా అని, ఇక్కడి నుంచే మూసీ బయలుదేరుతదని తెలిపారు. రాడార్ కేంద్రంతో వెలువడే రేడియేషన్తో మొత్తం పర్యావరణం దెబ్బతింటే, అడువులన్నీ పోతే రేపు వరి సాగు అవుతుందా? మూసీకి నీటి చుక్క వస్తదా? ఈ ప్రాంతంలో వ్యవసాయానికి మనుగడ ఉంటదా? అని అడిగారు. ఇవన్నీ ఈ ప్రభుత్వానికి తెలిసి ఒప్పుకున్నారా? తెలియక ఒప్పుకున్నారా? అని ప్రశ్నించారు.
పదేండ్ల క్రితం చేసిన ప్రజాభిప్రాయ సేకరణ ఇప్పుడెలా కరెక్టు? అని నిలదీశారు. 12 లక్షల చెట్లు ఎందుకు కొట్టేస్తున్నారో పరిగిలో బహిరంగ సభ పెట్టి చెప్పండి, 3 వేల ఎకరాల అటవీ భూములు తీసుకోవటంతో ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చే ఉద్యోగాలెన్నో చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాడార్ కేంద్రాన్ని తీసుకొస్తామంటే ప్రధాన ప్రతిపక్షంగా చూస్తూ ఊరుకోబోమని, రాడార్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారికి అండగా ఉంటామని హామీనిచ్చారు. తాము అధికారంలో ఉన్నపుడు పర్యావరణ హిత పరిశ్రమలనే తీసుకొచ్చామని, ఎక్కడా పర్యావరణానికి హాని చేయలేదని పేర్కొన్నారు.