బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. నేతల మాటల తూటాలతో ప్రచార పర్వం హోరెత్తుతోంది. కర్నాటక ఎన్నికలు ప్రజలకు సంబంధించినవని, ప్రధాని మోదీకి సంబంధించిన అంశాలతో ఇవి ముడిపడలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రజల సమస్యలు, అంశాలపై ప్రధాని స్పందించాలని ఆయన కోరారు. కర్నాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం తురువెకెరేలో జరిగిన ప్రచార సభలో రాహుల్ మాట్లాడారు.
ఈ ఎన్నికలు ఆయన (ప్రధాని మోదీ) గురించి కాదు..కర్నాటక ప్రజల కోసమని, గోవా, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల మధ్య నీటి వాటాల పంపిణీ విషయంలో బీజేపీ పాత్రపై ప్రధాని మోదీ మాట్లాడాలని అన్నారు. ఎన్నికల ప్రచార ర్యాలీల్లో రాష్ట్రంలో ఇతర బీజేపీ నేతల గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడాలని పేర్కొన్నారు. కర్నాటకలో పెచ్చరిల్లిన అవినీతిని పరిష్కరించేందుకు మోదీ ఏం చేశారని రాహుల్ నిలదీశారు. ఇక బీజేపీ అన్ని వర్గాల ప్రజలను మోసగించిందని కాషాయ పార్టీపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సైతం తీవ్ర విమర్శలు గుప్పించారు.
నిరుద్యోగం, పేదరికం వంటి ప్రధాన సమస్యల నుంచి బీజేపీ ప్రజల దృష్టిని మళ్లిస్తోందని ఆరోపించారు. కర్నాటకలోని బెళగావి జిల్లా ఖానాపూర్లో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన ప్రియాంక గాంధీ బీజేపీ తీరును దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం తమను లూటీ చేసిందని గుర్తెరిగిన ప్రజలు ప్రస్తుతం మార్పు కోరుతున్నారని అన్నారు. బసవరాజ్ బొమ్మై సారధ్యంలోని కర్నాటక ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపడుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కర్నాటకలో పాలక బీజేపీకి భంగపాటు తప్పదని ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేయడంతో కాంగ్రెస్, జేడీఎస్లు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. మే 10న కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More
అమిత్ షాపై పత్రికలో రాస్తావా?.. ఎంపీ జాన్ బ్రిట్టస్కు సమన్లు