న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్ షాను విమర్శిస్తూ పత్రికలో వ్యాసం రాస్తావా? అంటూ రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్, సీపీఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టస్కు సమన్లు జారీచేశారు. తన ముందు వెంటనే హాజరుకావాలని సదరు ఎంపీకి నోటీసులు జారీచేశారు. పత్రికలో వ్యాసం రాయటంపై సదరు ఎంపీ ధన్కర్ను కలిసి వివరణ ఇచ్చారు. అయినా రాతపూర్వక వివరణ ఇవ్వాల్సిందేనని చెప్పారట. ఈ మొత్తం వ్యవహారం తనను షాక్కు గురిచేసిందని, ఉలిక్కిపడేలా చేసిందని బ్రిట్టస్ ఆందోళన వ్యక్తం చేశారు.
కేరళ బీజేపీ చీఫ్ పీ సుధీర్ ఇచ్చిన ఫిర్యాదును మాత్రమే పరిగణనలోకి తీసుకొని, తనపై కేంద్రం ఇలా వ్యవహరించడాన్ని ఆయన తప్పుబట్టారు. కేరళను కించపరుస్తూ, అవమానిస్తూ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వివాదాస్పద ప్రసంగాన్ని విమర్శించాను తప్ప ఇందులో తన తప్పేముందని బ్రిట్టస్ ప్రశ్నిస్తున్నారు. అమిత్ షా ప్రసంగం ‘ప్రమాదంతో కూడిన ప్రచారం’గా పేర్కొంటూ బ్రిట్టస్ ఆంగ్ల దినపత్రిక ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’లో ఆర్టికల్ రాశారు.