న్యూఢిల్లీ : అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల మాటున కేంద్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోరాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్ ను దుయ్యబట్టారు. ఇవాళ యోగా దినోత్సవం..యోగా దినం మాటన తలదాచుకోరాదని కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ ఎదుర్కొనే విధానాన్ని ఉద్దేశించి రాహుల్ ట్వీట్ చేశారు.
కాగా యోగా డే సందర్భంగా అంతకముందు ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ కరోనాపై పోరాటంలో యోగా మనకు ఉత్తేజం కల్పించే ఆశాదీపంలా ముందుకొచ్చిందని వ్యాఖ్యానించారు. మరోవైపు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మోదీ సర్కార్ ఘోరంగా విఫలమైందని రాహుల్ గాంధీ పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. కొవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తితో జరిగిన ప్రాణ నష్టానికి మోదీ విధానాలే కారణమని కాంగ్రెస్ నేత పలుమార్లు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.