New Parliament | న్యూఢిల్లీ, మే 21: కొత్త పార్లమెంట్ భవనాన్ని ఈ నెల 28న ప్రధాని ప్రారంభిస్తారన్న లోక్సభ స్పీకర్ ప్రకటనపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దాన్ని రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా అభివర్ణించాయి. ఏ గొప్ప ప్రజాస్వామ్య దేశం ఇలా చేయలేదని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు ఆనంద్ శర్మ మండిపడ్డారు. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం రాష్ట్రపతితో చేయించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఆర్జేడీ నాయకుడు మనోజ్ కుమార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మోదీ ఇమేజ్ పెంచడం కోసం మర్యాదలు, నిబంధనలను పక్కన పెట్టేస్తున్నారని సీపీఐ నాయకుడి డీ రాజా విమర్శించారు. ‘ఆయన కార్యనిర్వాహక వ్యవస్థకు అధిపతి కానీ, శాసన వ్యవస్థకు కాదు. కొత్త పార్లమెంట్ను లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ప్రారంభిస్తే బాగుంటుంది. కొత్త భవనాన్ని ప్రజాధనంతో నిర్మించారు. కానీ ప్రధాని మోదీ తన స్నేహితులేదో తమ నిధులతో దాన్ని నిర్మించినట్టు ప్రవర్తిస్తున్నారెందుకో’ అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా వ్యాఖ్యానించారు. మరోవైపు హిందూత్వవాది సావర్కర్ జయంతి నాడే కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఏమొచ్చిందని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఇది గాంధీ, పటేల్, నెహ్రూ, అంబేద్కర్, బోస్ లాంటి నాయకులను అవమానించడమేనని పేర్కొన్నది.