న్యూఢిల్లీ : అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆదివాసీ మహిళ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మోదీ సర్కార్ అనుమతించలేదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. యూపీలోని అమేథిలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ పర్యటించారు. ద్రౌపది ముర్ము ఆదివాసీ మహిళ అయినందునే ఆమెను ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదని అన్నారు. రామాలయ ప్రారంభ వేడుకను ఆర్భాటంగా నిర్వహించినా..అక్కడ మీకు ఎవరైనా దళితులు కనిపించారా అని రాహుల్ ప్రజలను ప్రశ్నించారు.
మన రాష్ట్రపతి ఆదివాసీ కావడంతో ఆమెను ఈ కార్యక్రమానికి హాజరు కానీయకుండా దూరం పెట్టారని అన్నారు. ఆ కార్యక్రమంలో మీరు ఎవరైనా రైతు, కార్మికులను చూశారా అని అడిగారు. అసలు ఆ కార్యక్రమంలో ఎక్కడా ఓబీసీ ప్రజలు కనిపించలేదని అన్నారు. వ్యాపార వేత్తలంతా అక్కడే ఉన్నారు. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, నరేంద్ర మోదీ అక్కడే ఉన్నారని గుర్తుచేశారు.
భారత్ అణగారిన వర్గాల వారిదే..మీది కాదు..మీరు పైకి మాత్రం భారత్ మాతా కీ జై అంటూ హెలికాఫ్టర్లలో తిరుగుతూ సొమ్ము చేసుకుంటారని కాషాయ పాలకులను ఉద్దేశించి రాహుల్ ఆరోపణలు గుప్పించారు. తాము అధికారంలోకి రాగానే కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని పునరుద్ఘాటించారు.
రైతులను దేశ రాజధానికి రాకుండా అడ్డుకుంటున్నారు. వారేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. కేవలం మద్దతు ధరకు భరోసా ఇవ్వాలని కోరుతున్నారు. అదేమీ పెద్ద విషయం కాదని రాహుల్ పేర్కొన్నారు. ఇక తాము అదికారం చేపడితే కుల గణన నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. కుల గణన చేపట్టి దేశవ్యాప్తంగా ఓబీసీ, దళితులు, గిరిజనుల జనాభా శాతాన్ని నిర్ధారిస్తామని స్పష్టం చేశారు.
Read More :
Plane Villa | ఫ్లైట్ను లగ్జరీ విల్లాగా మార్చిన వ్యక్తి.. ఆనంద్ మహీంద్రా ఫిదా.. VIDEO