న్యూఢిల్లీ : పంజాబ్లో కాంగ్రెస్ అసంతృప్త నేత నవ్జోత్ సింగ్ సిద్ధూతో ఎలాంటి సమావేశం ఖరారు కాలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం పేర్కొన్నారు. రాహుల్, ప్రియాంక గాంధీలను కలిసి పార్టీ వ్యవహారాలను చర్చిస్తానని సిద్ధూ వెల్లడించిన క్రమంలో ఆయనతో ఎలాంటి సమావేశం షెడ్యూల్లో లేదని రాహుల్ స్పష్టం చేశారు. పంజాబ్ కాంగ్రెస్లో వర్గపోరు శ్రుతిమించిన క్రమంలో అధిష్టాన పెద్దలను కలిసేందుకు సిద్ధూ మంగళవారం పటియాలా నుంచి ఢిల్లీ చేరుకున్నారు.
మరోవైపు పంజాబ్లో పార్టీ పునర్వ్యవస్థీకరణతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సమాయాత్తం చేసేలా గత కొద్దివారాలుగా పంజాబ్ నేతలతో రాహుల్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేబినెట్ పునర్వ్యవస్థీకరణపైనా కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతోంది. కాగా పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, సిద్ధూల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు హైకమాండ్ కసరత్తు సాగిస్తోంది.