న్యూఢిల్లీ : భారత్ నుంచి పలు ప్రముఖ గ్లోబల్ బ్రాండ్స్ నిష్క్రమణ నేపధ్యంలో మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం విమర్శలు గుప్పించారు. హేట్ ఇన్ ఇండియా (విద్వేషం), మేకిన్ ఇండియాలు మనగలగలేవని వ్యాఖ్యానించారు.
దేశంలో నిరుద్యోగం విశృంఖలమైందని, నిరుద్యోగ సంక్షోభాన్ని చక్కదిద్దడంపై ప్రధాని మోదీ దృష్టి సారించాలని హితవు పలికారు. భారత్ నుంచి పరిశ్రమలు, వ్యాపారాలు నిష్క్రమిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏడు గ్లోబల్ బ్రాండ్లు..9 ఫ్యాక్టరీలు..649 డీలర్షిప్లు..84,000 ఉద్యోగాలు గల్లంతయ్యాయని రాహుల్ ట్వీట్ చేశారు.
చవర్లెట్, మ్యాన్ ట్రక్స్, పియట్, యునైటెడ్ మోటార్స్, హార్లీ డేవిడ్సన్, పోర్డ్, డాట్సన్ వంటి ఏడు ప్రముఖ గ్లోబల్ బ్రాండ్లు దేశం విడిచివెళ్లాయని చెప్పుకొచ్చారు. మోదీజీ హేట్ ఇన్ ఇండియా, మేకిన్ ఇండియా ఒకేసారి మనగలగలేవని వ్యాఖ్యానించారు. ఇక దేశంలో నిరుద్యోగ తీవ్రతపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలు మోదీ సర్కార్పై విరుచుకుపడుతున్నాయి.