భోపాల్ : మధ్యప్రదేశ్లో బీజేపీ నేతగా చెబుతున్న వ్యక్తి ఓ గిరిజన కూలీపై మూత్రం పోసిన ఘటనను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించారు. దళితులు, గిరిజనుల పట్ల బీజేపీ విద్వేషం ఈ అమానవీయ చర్యతో బయటపడిందని రాహుల్ బుధవారం ట్వీట్ చేశారు. కాషాయ పార్టీ నిజస్వరూపం ఈ ఉదంతంతో తేటతెల్లమైందని అన్నారు.
గిరిజన సోదరసోదరీమణులపై బీజేపీ పాలనలో వేధింపులు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లో బీజేపీ నేత చేసిన అమానవీయ నేరంతో మానవ సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఇది అమానవీయ ఘటనని ప్రియాంక గాంధీ అభివర్ణిస్తూ కాషాయ పార్టీపై మండిపడ్డారు. మధ్యప్రదేశ్లో బీజేపీ ఎమ్మెల్యేకు సన్నిహితుడైన వ్యక్తి గిరిజన కూలీపై నేరానికి పాల్పడిన ఘటన సిగ్గుచేటని ఆమె పేర్కొన్నారు.
రాష్ట్రంలో బీజేపీ 18 ఏండ్ల పాలనలో గిరిజనులపై వేధింపులకు సంబంధించి ఏకంగా 30,400 కేసులు వెలుగుచూశాయని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. బీజేపీ పాలనలో గిరిజనుల అభ్యున్నతిపై కేవలం మాటలు చెబుతుంటారని చేతల్లో శూన్యమని ఆరోపించారు. మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి గిరిజన కూలీపై మూత్రం పోస్తూ కెమెరాకు చిక్కిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
Read More :
Lalu on Modi Govt | కేసు తర్వాత కేసు.. మోదీ సర్కార్పై నిప్పులు చెరిగిన లాలూ..!